మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఆక్సిజన్, రెమిడెసివిర్ బ్లాక్ మార్కెట్ సహించం

ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్ అక్రమార్కులపై మహ్మద్ మహమూద్ అలీ

ఆర్సీ న్యూస్( హైదరాబాద్): ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్ లను బ్లాక్ మార్కెట్ కు తరలించే అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నామని హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. వారి పట్ల కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని ఆయన  వెల్లడించారు.  

 సిలిండర్ తో పాటు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ను బహిరంగ మార్కెట్ లలో అధిక ధరలకు విక్రయించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నామన్నారు. కోవిడ్-19 నేపథ్యంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన, చేపడుతున్న చర్యలపై ఆయన బుధవారం లక్డీకాపూల్ లోని తన కార్యాలయంలో హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్త, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తో పాటు రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమీషనర్లు మహేష్ మురళీధర్ భగవత్,వి.సి.సజ్జనార్, నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ అనీల్ కుమార్ తదితరులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

  •  ఈ సందర్భంగా పోలీసుల సేవలను కొనియాడుతూ..ఆక్సిజన్,రెమిడెసివిర్ లను బ్లాక్ మార్కెట్ కు తరలించే  అక్రమార్కులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. 
  • ఇప్పటికే రెండు,మూడు కేసులు నమోదు చేశామన్నారు. 
  • అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించాలని డీజీపీ మహేందర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశామన్నారు.
  • ప్రజల ప్రాణాలతో చెలగాటమా డాలని చూస్తే చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు. 
  • ఈ విషయంలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కొంత మానవత్వంతో వ్యవహరించాలన్నారు. 
  • లైఫ్ సేవింగ్ డ్రగ్స్ విక్రయించే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
  •   హైదరాబాద్ నగరం హెల్త్ హబ్ గా పేరుగాంచిందని..అందుకే ఇక్కడ 50 శాతం మంది రోగులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారు  వైద్య సేవలు పొందుతున్నారన్నారు.
  •  వైద్యం కోసం తమ రాష్ట్రానికి వచ్చే వారికి వైద్యం అందించకుండా తిరిగి పంపలేమని..అందుకే వారంతా నగరంలో వైద్య సేవలు పొందుతున్నారన్నారు.
  •  తమ వద్ద ఎక్కడా సిబ్బంది కొరత లేదన్నారు.
  •  సీఎం కేసీఆర్ అదనపు వైద్య సిబ్బందిని కొత్తగా రిక్రూట్ చేసుకోవచ్చునని అనుమతించారన్నారు.
  •  ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ..తమ వ్యాపారంగా మార్చుకుంటున్నాయన్నారు. 
  • మానవత్వంతో వ్యవహరించాల్సిన సమయంలో వ్యాపార దృక్పథం తో పని చేయడం సరైంది కాదన్నారు.
  •  ప్రమాదంలో ఉన్న వారికి అత్యవసర వైద్య సేవలు అందించే నెపంతో అధికంగా డబ్బులు వసూలు చేస్తే..చర్యలు తప్పవన్నారు.
  •  ప్రతి ఒక్కరూ కరోనా కట్టడి కోసం తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
  •  కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉందన్నారు.
  •  అధిక శాతం మందికి కరోనా సోకినప్పటికీ వైద్య సేవలు పొంది చాలా మంది కరోనా వైరస్ నుంచి బయట పడుతున్నారన్నారు.
  •  ఎంతో మందికి కోవిడ్ బాధితులు నయమవుతున్నారన్నారు.
  •  ప్రస్తుతం మన వద్ద ఆక్సిజన్ కొరత లేదన్నారు. 
  • దేశంలో ఎక్కడ చూసినా..ఆక్సిజన్ కొరత కనిపిస్తోందన్నారు. 
  • తాము అవసరమైన మేరకు ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకుంటున్నామన్నారు.
  •  దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరాను కేంద్ర ప్రభుత్వమే చూస్తుందన్నారు.
  •  అందరికీ టీకా పంపిణీ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వందేనన్నారు.
  •  మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా పంపిణీ చేస్తామన్నారు.
  •  95 శాతం మందిలో కరోనా వైరస్ లక్షణాలు లేవన్నారు.
  •  కేవలం కొద్డి మందికి మాత్రమే కరోనా వైరస్ లక్షణాలున్నాయన్నారు.
  •  వీరందరూ ఆసుపత్రుల్లో చేరి బాగవుతున్నారన్నారు.
  •  వాక్సినేషన్ పంపిణీ సక్రమంగా జరుగుతోందన్నారు.
  •  కరోనా వైరస్ కట్టడి కోసం టెస్టులు అధికంగా చేస్తున్నామన్నారు.
  •  కొంత మంది ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆక్సిజన్ సిలిండర్లను తమ వద్ద నిలువ ఉంచుకుంటున్నారని..ఇది సరైంది కాదన్నారు.
  •  అలాగే రెమిడెసివిర్ ఇంజక్సన్లను కూడా అవసరానికి ముందే ఖరీదు చేసుకుని నిల్వ ఉంచుకుంటున్నారన్నారు.
  •  వాటి అవసరం ఉంటుందో..ఉండదో తెలియనప్పటికీ..ముందస్తు చర్యలు అంటూ నిల్వ ఉంచుకుంటున్నారు. ఇది సరైంది కాదన్నారు. 
  • అలా చేయడం వలన అవసరమైన వారికి దొరకని దుర్బర పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు. 
  • ఆక్సిజన్ సిలిండర్ తో పాటు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అయిన రెమిడెసివిర్ ను బ్లాక్ మార్కెట్ చేస్తే సహించేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారన్నారు.
  •  ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతున్నందున ముస్లింలు తప్పనిసరిగా కరోనా కట్టడి కోసం అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 
  • మసీదులలో నమాజులు చేసేటప్పటి నుంచి తరావీల వరకు తప్పనిసరి భౌతిక దూరం పాటించాలన్నారు
  •  ప్రతి ఒక్కరు మాస్క్లు ధరించాలన్నారు.
  •  జ్వరం, దగ్గు, జలుబు ఉన్నట్లయితే..వెంటనే గుంపు నుంచి దూరంగా ఉండాలన్నారు.
  •  అవసరమైన మేరకు టెస్టు లు చేయించుకుని వైద్య సేవలు పొందాలన్నారు.
  •  తమ వద్ద బెడ్ల కొరత లేదన్నారు. 
  • వారం రోజుల్లో మూడు వేలకు పైగా ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి వస్తున్నాయన్నారు.
  •  కరోనాపై అసత్య ప్రచారాలు చేసే సామాజిక మాధ్యమాలపై పోలీసులు దృష్టి సారించాలన్నారు.
  •  పుకార్లు పుట్టించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆయన పోలీసు బాస్ లను కోరారు.