మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

చార్మినార్ లో కూడా సండే ఫన్ డే..

చార్మినార్ లో కూడా సండే ఫన్ డే..
  • ఈనెల 17 నుంచి చార్మినార్ లో..
  • ట్యాంక్ బండ్ లాగే..చార్మినార్ లో కూడా..
  •  ఆదివారం సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు..
  • చిన్నారుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు..
  • ముషాయిరా, ఖవ్వాలీ..తదితర ఎంటర్టైన్మెంట్స్.. 
  • ఎంపీ అసద్, సిటీ సీపీ అంజనీ కుమార్లతో కలిసి చార్మినార్ లో పర్యటించిన అరవింద్ కుమార్.. 

ఆర్సీ న్యూస్, అక్టోబర్ 15(హైదరాబాద్): ప్రస్తుతం ట్యాంక్ బండ్ పై కొనసాగుతున్న “సండే – ఫన్ డే” కార్యక్రమం లాగే పాతబస్తీ చార్మినార్ లో కూడా కొనసాగించడానికి అధికారులు ముందుకు వచ్చారు. గత కొన్ని రోజులుగా వెహికల్ ఫ్రీ జోన్ గా కొనసాగిస్తున్న.. అధికారులు ప్రజలు కాస్సేపు సరదాగా సంతోషంగా గడపడానికి ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్ పై  సండే ఫన్ డే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు సరదాగా ట్యాంక్బండ్ పై గడపడానికి అవకాశం కలిగింది. ప్రతి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎలాంటి వాహనాలను అనుమతించకుండా కేవలం ప్రజలను మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో ప్రతి ఆదివారం సాయంత్రం నగర ప్రజలు ట్యాంక్బండ్ పై సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించడంతో చార్మినార్ లో కూడా ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చార్మినార్ లో కూడా సండే ఫన్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుంది అనే విషయాన్ని ట్విట్టర్ ద్వారా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి వివరించారు. ఇదే విషయాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ ఈ నెల 11న తన ట్విట్టర్ లో రీ-ట్వీట్ చేశారు. చార్మినార్ లో కూడా సండే ఫన్ డే నిర్వహించడానికి అధికారులు ముందుకు వస్తే బాగుంటుంది అనే విషయానికి కొంతమంది సపోర్ట్ చేయడంతో ఈనెల 17వ తేదీ నుంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తో కలిసి అరవింద్ కుమార్ చార్మినార్ ను సందర్శించారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, నగర ట్రాఫిక్ డిసిపి కరుణాకర్, దక్షిణ మండలం డిసిపి డాక్టర్ గజరావు భూపాల్, జిహెచ్ఎంసి చార్మినార్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్, దక్షిణ మండలం ట్రాఫిక్ ఏసీపీ రాములు నాయక్, చార్మినార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస రావు తదితరులు చార్మినార్ వద్ద అరవింద్ కుమార్ తో కలిసి సండే ఫన్ డే కార్యక్రమం కోసం పరిశీలించారు. చార్మినార్ నలువైపులా ఇప్పటికే ఏర్పాటు చేసిన గ్రానైట్ రోడ్డులో సండే ఫన్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనే విషయాన్ని అధికారుల బృందం తేల్చింది. ఈనెల 17వ తేదీన సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కార్యక్రమం నిర్వహించడానికి అధికారులు సిద్ధమయ్యారు. చార్మినార్ వద్ద నిర్వహించే ఈ కార్యక్రమం సందర్భంగా పలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. ముషాయిరా, ఖవ్వాలీ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగించనున్నారు. చార్మినార్ లో వారం విడిచి వారం నిర్వహించడానికి అధికారులు సిద్ధమయ్యారు. అయితే ప్రస్తుతం ట్యాంక్బండ్ పై ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం కొనసాగుతుండగా..చార్మినార్ లో మాత్రం వారం విడిచి వారం కొనసాగించడానికి రూపకల్పన చేశారు. సండే ఫన్ డే లో పాల్గొనడానికి వచ్చే వారందరి సౌకర్యార్థం పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉచిత పార్కింగ్ సౌకర్యం చార్మినార్ పరిసరాల్లోనే ఉంటుంది. ట్రాఫిక్ సమస్యలతో పాటు పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు ఇప్పటికే తగిన చర్యలకు శ్రీకారం చుట్టారు. కూడా స్టేడియంతో పాటు ఖిల్వత్ మైదానం, చార్మినార్ ఆర్టీసీ పాత బస్టాండ్, ఓల్డ్ పింఛన్ పేమెంట్ కార్యాలయం ఖాళీ స్థలం, జిహెచ్ఎంసి సర్దార్ మహల్ భవనం, చార్మినార్ యునాని ఆసుపత్రి ప్రాంగణం తదితర ప్రాంతాల్లో వాహనదారులకు ఉచితంగా పార్కింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఈ ఆదివారం నుంచి చార్మినార్ లో నిర్వహించే సండే ఫన్ డే  కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన వస్తే రాబోయే రోజుల్లో మరిన్ని సౌకర్యాలతో పాటు ఆహార పదార్థాల విక్రయాలు, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, చిల్డ్రన్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సంబందిత అధికారులు చెబుతున్నారు.