మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

అంగరంగ వైభవంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బంగారు బోనం…

అంగరంగ వైభవంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బంగారు బోనం..
  • లాల్ దర్వాజ నుంచి చార్మినార్ వరకు సామూహిక ఊరేగింపు
  • సింహవాహిణి దేవాలయంలో పూజల అనంతరం కొనసాగిన ఊరేగింపు
  • భాజాభజంత్రీల నడుమ, పోతురాజుల న్రుత్యాలతో కొనసాగిన సామూహిక ఊరేగింపు
  • చార్మినార్ కట్టడం చుట్టూ నృత్యాలు చేస్తూ ప్రదక్షిణ అనంతరం బోనం సమర్పణ…

 

ఆర్సీ న్యూస్, జూలై 27 (హైదరాబాద్): సప్త మాత్రుకల సప్త బంగారు బోనం కార్యక్రమం లో భాగంగా మంగళవారం సాయంత్రం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి భక్తులు బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా లాల్ దర్వాజ సింహవాహిణీ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బంగారు పాత్రలో బోనంతో పాటు పట్టు వస్త్రాలను తీసుకుని చార్మినార్ కు ఊరేగింపుగా బయలు దేరారు. దారి పొడవునా నృత్యాలు, బ్యాండ్ మేళాలతో లాల్ దర్వాజ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున సామూహిక ఊరేగింపు నిర్వహించారు. అనంతరం కోట మైసమ్మ దేవాలయం వద్ద అమ్మవారికి పూజలు నిర్వహించారు. కోట మైసమ్మ దేవాలయం కమిటి అధ్యక్షులు రాయికోట్ బాబురాజా ఊరేగింపు కమిటి ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. బంగారు బోనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి భాజాభజంత్రీల నడుమ, పోతురాజుల న్రుత్యాలతో సామూహిక ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి నైవేధ్యం సమర్పించి పట్టు వస్త్రాలు అందజేశారు. చార్మినార్ వద్ద జొగిని నిషా క్రాంతి బంగారు బోనం తలపై పెట్టుకుని నిమ్మకాయలు నోట్లో పెట్టుకుని కోరుకుతూ చేసిన నృత్యాలు చార్మినార్ వద్ద ఉన్న పర్యాటకులతో పాటు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పర్యాటకులు బంగారు బోనం ఊరేగింపును తమ తమ సెల్ ఫోన్ లలో బందించారు. సెల్పీలు తీసుకున్నారు. చార్మినార్ వద్ద భక్తుల సందడి కనిపించింది. దక్షిణ మండలం పోలీసులు గట్టి బందోబస్తు కొనసాగించారు.

చార్మినార్ కట్టడం చుట్టూ నృత్యాలు చేస్తూ ప్రదక్షిణ…

చార్మినార్ కట్టడం చుట్టూ నృత్యాలు చేస్తూ ప్రదక్షిణ నిర్వహించారు. ఈ సందర్బంగా ఊరేగింపు కమిటి అధ్యక్షులు బత్తుల బల్వంత్ యాదవ్ మాట్లాడుతూ…సప్త మాత్రుకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా ఏడుగురు అమ్మవార్లకు ఏడు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. మొదటి బంగారు బోనంగా గోల్కోండ జగదాంబ అమ్మవారికి.. రెండో బోనంగా బల్కంపేట అమ్మవారికి.. మూడో బోనంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి, నాలుగవ బోనంగా విజయవాడలో కనక దుర్గమ్మ తల్లికి,ఐదో బోనం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించామన్నారు. ఆరో బోనంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి సమర్పించామన్నారు. ఇక చివరి బంగారు బోనమైన ఏడో బోనం లాల్ దర్వాజ సింహవాహిణీ అమ్మవారికి ఈ నెల 29న సమర్పించనున్నామన్నారు. బంగారు బోనం ఊరేగింపు, సమర్పణ సందర్బంగా భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. కరోనా వైరస్ కట్టడి చర్యలు పాటిస్తూనే బంగారు బోనం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 

ఆగస్టు 1న, నగరంతో పాటు పాతబస్తీలో బోనాల సమర్పణ…

ఆగస్టు 1వ తేదీన నగరంలోని ఇతర ప్రాంతాలతో పాటు పాతబస్తీలో అమ్మవారికి బోనాల సమర్ఫన కార్యక్రమం జరుగుతుంది. అనంతరం ఆగస్టు 2న, పాతబస్తీ వీధుల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. పాతబస్తీలో గతేడాది కరోనా  వైరస్ కారణంగా అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు నిరాడంబరంగా కొనసాగింది. భక్తుల హడావుడి లేకుండా మూసి నది వరకు కొనసాగిన ఊరేగింపు సాదా సీదాగా జరిగింది. ఈసారి అత్యంత వైభవంగా కన్నుల పండువగా నిర్వహించడానికి ఉత్సవాల నిర్వాహకులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు. ఈ నెల 23న కలశ స్థాపనతో పాతబస్తీలో బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.  అలాగే ఉత్సవాలలో భాగంగా ఈ నెల 25న పాతబస్తీలో అమ్మవారి ఘట స్థాపన సామూహిక ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగింది. ఊరేగింపు అనంతరం ఆయా దేవాలయాలలో అమ్మవారి ఘట స్థాపన జరిగింది. ఆగస్టు 2న కళాకారుల ఆటలతో పోతురాజుల విన్యాసాలతో సామూహిక ఊరేగింపు కొనసాగనుంది.