ఏప్రిల్ 19, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఆగస్టు 1న,అంగరంగ వైభవంగా బోనాల జాతర ఉత్సవాలు…

ఆగస్టు 1న,అంగరంగ వైభవంగా బోనాల జాతర ఉత్సవాలు…
  • ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసుకున్న ఉత్సవాల నిర్వాహకులు
  • ఈ నెల 30న,లాల్ దర్వాజ అమ్మవారికి బంగారు బోనం..
  • సప్తమాత్రుకల సప్త బంగారు బోనంలో చివరి బంగారు బోనం..
  • భాజాభజంత్రీల నడుమ, పోతురాజుల నృత్యాలతో కొనసాగనున్నసామూహిక ఊరేగింపు
  • లాల్ దర్వాజ చౌరస్తా నుంచి సింహవాహిణి దేవాలయం వరకు ఊరేగింపు…
  • 30న,విజయవాడ కనక దుర్గమ్మదేవస్థానం నుంచి పాతబస్తీ అమ్మవార్లకు పట్టు వస్త్రాలు,సారే సమర్పణ..

 

ఆర్సీ న్యూస్, జూలై 29 (హైదరాబాద్): తెలంగాణ సంసృతి, సంప్రదాలకు అనుగుణంగా నగరంలో అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగే ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలలో పాతబస్తీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. బోనాల సమర్పణ మరుసటి రోజైన సోమవారం పాతబస్తీ వీధుల్లో నిర్వహించే అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెలవు ఇస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన అనంతరం బోనాల జాతర ఉత్సవాలను స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా పాతబస్తీలో జరిగే అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు రోజును పరిగణిస్తోంది. ఇలా బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని ఇచ్చే సెలవు పాతబస్తీలో జరిగే జాతర రోజు కావడంతో పాతబస్తీ బోనాల జాతర ఉత్సవాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆగస్టు 1వ తేదీన నగరంలోని ఇతర ప్రాంతాలతో పాటు పాతబస్తీలో అమ్మవారికి బోనాల సమర్ఫన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి నిర్వాహకులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆగస్టు 2న, పాతబస్తీ వీధుల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఉత్సవాల నిర్వాహకులు కళాకారులు,శకటాలను ఏర్పాటు చేయండం కోసం కొంత మంది ఆర్డర్లు సైతం ఇచ్చేశారు. పాతబస్తీలో గతేడాది కరోనా  వైరస్ కారణంగా అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు నిరాడంబరంగా కొనసాగింది. భక్తుల హడావుడి లేకుండా మూసి నది వరకు కొనసాగిన ఊరేగింపు సాదా సీదాగా జరిగింది. ఈసారి అత్యంత వైభవంగా కన్నుల పండువగా నిర్వహించడానికి ఉత్సవాల నిర్వాహకులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు. ఈ నెల 23న కలశ స్థాపనతో పాతబస్తీలో బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అలాగే ఉత్సవాలలో భాగంగా ఈ నెల 25న పాతబస్తీలో అమ్మవారి ఘట స్థాపన సామూహిక ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగింది. ఊరేగింపు అనంతరం ఆయా దేవాలయాలలో అమ్మవారి ఘట స్థాపన జరిగింది. ఆగస్టు 2న కళాకారుల ఆటలతో పోతురాజుల విన్యాసాలతో సామూహిక ఊరేగింపు కొనసాగనుంది.

30న,చివరి బంగారు బోనం లాల్ దర్వాజ సింహవాహిణి అమ్మవారికి..

సప్త మాత్రుకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా చివరి బంగారు బోనాన్ని లాల్ దర్వాజ సింహావాహిణి అమ్మవారికి భక్తులు బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. లాల్ దర్వాజ చౌరస్తా నుంచి సింహవాహిణీ దేవాలయం వరకు బంగారు పాత్రలో బోనంతో పాటు పట్టు వస్త్రాలను తీసుకుని ఊరేగింపుగా బయలు దేరనున్నారు. దారి పొడవునా నృత్యాలు, బ్యాండ్ మేళాలతో లాల్ దర్వాజ దేవాలయం వరకు పెద్ద ఎత్తున సామూహిక ఊరేగింపు నిర్వహించనున్నారు. అనంతరం అమ్మవారికి నైవేధ్యం సమర్పించి పట్టు వస్త్రాలు అందజేయనున్నారు. నిషా క్రాంతి బంగారు బోనం తలపై పెట్టుకుని నిమ్మ కాయలు నోట్లో పెట్టుకుని కోరుకుతూ చేసే నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకో నున్నాయి. ఈ సందర్బంగా ఊరేగింపు కమిటి అధ్యక్షులు బత్తుల బల్వంత్ యాదవ్ మాట్లాడుతూ…సప్త మాత్రుకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా ఏడుగురు అమ్మవార్లకు ఏడు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. మొదటి బంగారు బోనంగా గోల్కోండ జగదాంబ అమ్మవారికి.. రెండో బోనంగా బల్కంపేట అమ్మవారికి.. మూడో బోనంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి, నాలుగవ బోనంగా విజయవాడలో కనక దుర్గమ్మ తల్లికి,ఐదో బోనం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించామన్నారు. ఆరో బోనంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి సమర్పించా మన్నారు. ఇక చివరి బంగారు బోనమైన ఏడో బోనం లాల్ దర్వాజ సింహవాహిణీ అమ్మవారికి ఈ నెల 30న, సమర్పించనున్నామన్నారు. బంగారు బోనం ఊరేగింపు, సమర్పణ సందర్బంగా భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేశామ న్నారు. కరోనా వైరస్ కట్టడి చర్యలు తీసుకుంటూనే బంగారు బోనం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇక,శుక్రవారం సాయంత్రం విజయవాడ కనక దుర్గమ్మ తల్లి దేవస్థానం తరఫున ఆలయ ఈవో భ్రమరాంబ, ఆలయ కమిటి చైర్మన్ పైలా స్వామినాయిడుతో పాటు బోర్డు మెంబర్లు పాతబస్తీలోని ప్రధాన అమ్మవారి దేవాలయాలను సందర్శించి అమ్మవారికి పట్టు వస్త్రాలు,సారే సమర్పించనున్నారన్నారు. ముందుగా లాల్ దర్వాజ సింహవాహిణి దేవాలయంను సందర్శించి అమ్మవారికి పట్టు వస్త్రాలు,సారే అందజేసి ప్రత్యేక పూజలు చేస్తారన్నరు. అనంతరం ఉప్పుగూడ,గౌలిపురా,సుల్తాన్ షాహీ, బేలా చందులాల్, హరిబౌలి, మీరాలంమండి దేవాలయాలను సందర్శించి పట్టు వస్త్రాలను అందజేస్తారన్నారు.