ఏప్రిల్ 19, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఉచిత క్యాబ్ లను సద్వినియోగం చేసుకోండి: రాచకొండ సీపీ

ఉచిత క్యాబ్ లను సద్వినియోగం చేసుకోండి

ఆర్సీ న్యూస్: మెడికల్ ఎమర్జెన్సీ కోసం సీనియర్ సిటిజన్స్,గర్బిణీ స్త్రీల కోసం ఉచిత క్యాబ్ (ఫ్రి క్యాబ్) సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ మురళిధర్ భగవత్ అన్నారు. ఈ ఉచిత క్యాబ్ సేవలు కోవిడ్ పేషంట్స్ కోసం కాదని..కోవిడ్ కాకుండా ఇతర అత్యవసర వైద్య సేవల వినియోగం కోసం అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఎల్.బి.నగర్ లో నాలుగు క్యాబ్ లను జెండా ఊపి ప్రారంభించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని భువనగిరి జోన్ లోని చౌటుప్పల్ డివిజన్, ఎల్బీనగర్ జోన్ పరిధిలోని బాధితుల సౌకర్యార్ధం నాలుగు క్యాబ్ లు అందుబాటులో ఉంటాయి. శ్రీనివాస టూర్స్ అండ్ ట్రావెల్స్ సహకారంతో ప్రతి రోజు రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు ఈ క్యాబ్ సర్వీసుల సేవలను అవసరమైన వారు వినియోగించుకోవచ్చను. మె 31 వరకు రాత్రిపూట కరోనా కర్ప్యూ కొనసాగుతుంది. ఎల్బీ నగర్,వనస్థలిపురం, చౌటుప్పల్, ఇబ్రహీం పట్నం తదితర ప్రాంతాల బాధితులకు ఈ క్యాబ్ సౌకర్యాలు మేలు చేయనున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగున్న నేపధ్యంలో రాష్ట్రంలో రాత్రిపూట కరోనా కర్ప్యూ కొనసాగుతోంది. కరోనా వైరస్ సోకిన రోగులు కాకుండా ఇతర రోగులకు అత్యవసర వైద్య సేవలు అందడానికి రవాణా సౌకర్యం వీలు పడడం లేదు. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని వీరి సౌకర్యార్ధం రాచ కొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ నాలుగు ఉచిత క్యాబ్ సర్వీసులకు స్వీకారం చుట్టారు. అత్యవసర వైద్య సేవల కోసం ఆసపత్తులకు వెళ్లేందుకు సీనియర్ సిటిజన్స్ తో పాటు మహిళలు,గర్బిణీ స్త్రీల కోసం అర్దరాత్రి పూట క్యాబ్ లు అవసరమైన వారు రాచకొండ పోలీసు కంట్రోల్ నెంబర్ 9490617234 కు ఫోన్ చేయాలని సీపీ తెలిపారు. ఇలాంటి సేవలను ఇప్పటికే మరికొన్నింటిని అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ ఉచిత క్యాబ్ సేవలు కోవిడ్ రోగుల కోసం కాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. నాన్ కోవిడ్ ఎమర్జెన్సీ సర్వీస్ కోసం వీటిని అందుబాటులో ఉంచామన్నారు. అలాగే మల్కాజిగిరి జోన్ కోసం నేరేడ్ మెట్ వద్ద ఉచిత క్యాబ్ సర్వీస్ అందుబాటులో ఉందన్నారు. లాస్ట్ రైడ్ పేరుతో అందుబాటులో ఉన్న ఈ ఉచిత సర్వీస్ ను కోవిడ్ తో మరణించిన వారి కుటుంబ సభ్యుల కోసం పని చేస్తుందన్నారు. ఈ సర్వీస్ తో పాటు ప్లాస్మా కోసం రాచకొండ పోలీసు కంట్రోల్ నెంబర్ 9490617234 కు ఫోన్ చేయాలని సీపీ తెలిపారు. ఇదిలా వుండగా..మే 1వ తేదీ నుంచి 18 ఏళ్ల వయస్సు నుంచి వాక్సిన్ ఇస్తున్నందున..ప్రతి ఒక్కరూ టీకా వేయంచుకోవాలన్నారు. ఈ టీకా వేయించుకునే ప్రతి యువకుడు ముందుగా రక్తదానం చేయాలని ఆయన కోరారు. ప్రస్తుతం బ్లడ్ బ్యాంక్ లలో రక్తం కొరత ఎక్కువగా ఉందని..టీకా కార్యక్రమం సందర్బంగా యువకులు తమ రక్తాన్ని దానం చేస్తే..రక్తం కొరత ఉండదని ఆయన సూచించారు. త్వరలో ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా రాచకొండ పోలీసు కమీషనరేట్ వద్ద రక్త దాన శిభిరం నిర్వహిస్తారన్నారు. ఫ్రంట్ వారియర్స్ గా తమ పోలీసు సిబ్బంది ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ విధినిర్వాహణ కొనసాగిస్తున్నా రన్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ..విధినిర్వాహణలో వారు ఎక్కడ అలసట చెందడం లేదన్నారు. వారి సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించుకుంటా రన్నారు. ఇప్పటికే 1339 మంది పోలీసులు కరోనా వైరస్ కు బలయ్యారన్నారు. ప్రస్తుతం 300 మందికి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కు గురయ్యారన్నారు. కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న పోలీసు సిబ్బందికి మెడికల్ కిట్, అవసరమైన డ్రై ఫ్రూట్స్ తో పాటు రూ.5000 లను అందజేస్తున్నామన్నారు. వీరంతా సంపూర్ణ ఆరోగ్యంగా కోలుకునే వరకు తాము అండగా ఉంటున్నామన్నారు. అలాగే జూమ్ యాప్ ద్వారా సంబంధిత వైద్యులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తు..వైద్య సేవలను తీసుకుంటున్నామన్నారు. ఇలా చేయడం ద్వారా మానసిక స్థైర్యం కల్పించినట్లు అవుతుందని సీపీ మహేష్ భగవత్ అన్నారు.