మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని కోరుతూ పాదయాత్ర..

గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని కోరుతూ పాదయాత్ర..
  • చార్మినార్ నుంచి ఢిల్లీ వరకు కొనసాగనున్న పాదయాత్ర..
  • ముందుగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు..
  • అనంతరం న్యూ ఢిల్లీకి ప్రారంభమైన పాదయాత్ర..
  • 1500 కిలోమీటర్లు.. నలభై ఒక్క రోజుల పాదయాత్ర..
  • ఎనిమిది మంది సభ్యుల బృందంతో.. పాదయాత్ర అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో పాదయాత్ర..

ఆర్సీ న్యూస్, నవంబర్ 13 (హైదరాబాద్): గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని కోరుతూ పాదయాత్ర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో చార్మినార్ నుంచి న్యూ ఢిల్లీ వరకు శనివారం పాదయాత్ర ప్రారంభమైంది. సేవా సమితి అధ్యక్షులు బాలకృష్ణ గురుస్వామి తన ఎనిమిది మంది సభ్యుల బృందంతో కలిసి ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ముందుగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గోవులను తీసుకుని ఢిల్లీకి బయలుదేరారు. చార్మినార్ దగ్గర జరిగిన పూజలలో త్రిదండి దేవనాధ్ జీయర్ స్వామితో పాటు మాతా నిర్మలానంద యోగ భారతి తదితరులు పాల్గొన్నారు. పూజల అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి న్యూఢిల్లీ వరకు చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని కోరారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వేల టన్నుల మాంసం విదేశాలకు ఎగుమతి అవుతోందని.. రోజూ ఎన్నో వేల సంఖ్యలోగోవులు సంహరించ బడుతున్నాయనీ వారు ఆవేదన వ్యక్తం చేశారు. 41 రోజుల పాటు జరిగే ఈ పాదయాత్ర 1500 కిలోమీటర్లు నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. భారతీయ సంస్కృతి,సంప్రదాయాలను కాపాడే విధంగా గోవులను రక్షించాల్సిన బాధ్యత భారతీయులందరి పై ఉందన్నారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటిస్తే.. రాజ్యాంగబద్ధంగా వాటన్నింటినీ రక్షించుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయని పాదయాత్ర అయ్యప్ప స్వామి సేవా సమితి అధ్యక్షులు బాలకృష్ణ గురు స్వామి అన్నారు. ఇక్కడి నుంచి బయలుదేరుతున్న తాము న్యూ ఢిల్లీకి చేరుకుని పార్లమెంట్ భవనం వద్ద పార్లమెంటు సభ్యులతో పాటు కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు అందజేయనున్నామన్నారు. గోహత్య బంద్ కరో.. అంటూ దారి పొడవునా నినాదాలు చేసుకుంటూ న్యూఢిల్లీ వరకు పాదయాత్ర నిర్వహించనున్నా మన్నారు. గోవులను గో బందు కింద  పరిగణించి జాతీయ ప్రాణిగా ప్రకటించాలని..న్యూ ఢిల్లీలో పార్లమెంట్ భవనం చుట్టూ గోవులతో ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. చార్మినార్ నుంచి బయలు దేరిన ఈ పాదయాత్ర లాడ్ బజార్, మూసాబౌలి ద్వారా బేగంబజార్ నుంచి ముందుకు కదిలింది. కొంతమంది గో భక్తులు దారి పొడవునా పాదయాత్రకు స్వాగతం పలికి గోవులకు కుంకుమ బొట్లు పెట్టి పూజలు నిర్వహించారు.