మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి పోటెత్తిన భక్తులు..

  • భక్తులతో కిటకిటలాడుతున్న చార్మినార్ పరిసరాలు..
  • నగర ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి చార్మినార్ చేరుకుంటున్న అమ్మవారి భక్తులు..
  • బారికేడ్లు ఏర్పాటు చేసి క్యూ పద్ధతి తో భక్తులకు అనుమతి..
  • మోహిని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్న భాగ్య లక్ష్మీ అమ్మవారు..
  • ఈ నెల రెండో తేదీ నుంచి ప్రారంభమైన దీపావళి ఉత్సవాలు..

ఆర్సీ న్యూస్, నవంబర్ 05(హైదరాబాద్):  దీపావళి వేడుకలను పురస్కరించుకొని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి చార్మినార్ వచ్చారు. దీంతో చార్మినార్ కట్టడం పరిసరాలు భక్తుల రద్దీతో కిటకిట లాడుతున్నాయి. అమ్మవారి దర్శనం కోసం వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సంబంధిత అధికారులతో పాటు భాగ్యలక్ష్మి దేవాలయం ఉత్సవాల నిర్వాహకులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు. దీపావళి ఉత్సవాల సందర్భంగా భాగ్యలక్ష్మి దేవాలయంలో ఈనెల నెల 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 2వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు 3వ తేదీన దీపావళి నరక చతుర్దశి..4వ తేదీన దీపావళి వేడుకలు జరిగాయి. నాలుగో తేదీన సాయంత్రం ఏడు గంటల నుంచి అమ్మవారి దివ్య దర్శనం తో పాటు అమ్మవారి భక్తులకు ఖజానా పంపిణీ ప్రారంభమైంది. దీపావళి వేడుకల సందర్భంగా భాగ్య లక్ష్మీ అమ్మవారు మోహిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. నగరంలోని భక్తులే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. చార్మినార్ కట్టడం నుంచి గుల్జార్ హౌస్ వైపు పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులకు క్యూ పద్ధతి దర్శనానికి అనుమతిస్తున్నారు. వాహనాల్లో వచ్చే భక్తులకు పార్కింగ్ ఏర్పాట్లు అందుబాటులోకి తెచ్చారు. చార్మినార్ పరిసరాల్లో ఉచితంగా పార్కింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. అమ్మవారి దివ్య దర్శనం కోసం వస్తున్న భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించారు. అమ్మవారి  ఉత్సవాలు ఈనెల ఆరో తేదీ వరకు కొనసాగనున్నాయి. వీఐపీలతో పాటు ప్రత్యేక ఆహ్వానితులకు విఐపి దర్శనం కల్పిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. దీపావళి వేడుకలను పురస్కరించుకొని ఇప్పటికే అమ్మవారి ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. వివిధ రకాల పూలతో కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో ఆలయాన్ని ఆకర్షణీయంగా అలంకరించారు. దక్షిణ మండలం పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తుండగా.. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస రావు తమ సిబ్బందితో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కొనసాగిస్తున్నారు.