మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

కరోనా వైరస్ కట్టడి కి అందరి సహకారం అవసరం: సిటీ సీపీ

కరోనా వైరస్ కట్టడి కి అందరి సహకారం అవసరం: సిటీ సీపీ
  • కరోనా వైరస్ వ్యాప్తి పై అవగాహన
  • అనవసరంగా రోడ్ల మీదకు రావద్దని పిలుపు
  • నగరంలో పటిష్టంగా లాక్ డౌన్ అమలు
  • కరోనా బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
  • ఆకట్టుకున్న కరోనా వేషాధారణ.

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): నగరంలో కరోనా వైరస్ కట్టడి కి కొనసాగుతున్న లాక్ డౌన్ అమలు తీరును బుధవారం నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పరిశీలించారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ లా అండ్ ఆర్డర్, నగర ట్రాఫిక్, మౌంటెడ్ పోలీస్ ఆధ్యర్యంలో నగరంలోని మొజంజాహీ మార్కెట్ లో కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను ద్రుష్య రూపంలో కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. కరోనా వైరస్ వేషాధారణ అటువైపు నుంచి రాకపోకలు సాగించే వాహనదారులతో పాటు స్థానికులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నగరంలో లాక్ డౌన్ పటిష్టంగా అమలు జరుగుతుందన్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి కరోనా వైరస్ వ్యాప్తికి బాధ్యులు కావద్దన్నారు. లాక్ డౌన్ విధించిన సమయంలో ఇంటి వద్దే సురక్షితంగా ఉండాలన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలలో డౌన్ చక్కగా అమలు జరుగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు సహకరిస్తు న్నారన్నారు. కొంతమంది యువకులు కావాలని రోడ్ల మీదకు వచ్చి కరోనా వైరస్ వ్యాప్తికి పాల్పడుతున్నారన్నారు. కరోనా వైరస్ చైన్ ను బ్రేక్ చేయాల్సిన అవసరం ఉన్నందున తామంతా ఇళ్లలోనే ఉండాలన్నారు. సకాలంలో వైద్య సేవలు పొందడమే కాకుండా కరోనా వైరస్ కట్టడికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. వైరస్ తో బాధపడుతున్నవారందరూ ఎలాంటి మానసిక ఆందోళనకు గురికావద్దన్నారు. కొంతమంది తమకు కరోనా వైరస్ సోకిందని అనవసరంగా భయాందోళ నలకు గురవుతున్నారని..భయమే మనిషిని కడతేరుస్తుందన్నారు. నిలకడగా తమ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పడు పరిశీలించుకుంటూ వైద్యులు సూచించిన సలహాలు, సూచనలతో పాటు అవసరమైన ఐసోలేషన్ మెడికల్ కిట్లు వాడుతున్న వారు కోలుకుంటున్నారన్నారు. లాక్ డౌన్ ను మరింత పటిష్టంగా అమలు చేస్తే..కరోనా వైరస్ చైన్ ను బ్రేక్ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. కరోనా కట్టడికి రోడ్లపై వాహనాల రాకపోకలను కట్టడి చేస్తున్నామన్నారు. దానికి అందరి సహకారం ఎంతో అవసరమని నగర సీపీ అంజనీ కుమార్ అన్నారు.

నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వాహనాలను తనిఖీలు చేసి స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. లాక్ డౌన్ ను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ తో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి జారీ చేసిన ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

లాక్ డౌన్ ఉన్నప్పటికీ..కొంతమంది ఎలాంటి అత్యవసర పరిస్థితులు లేనప్పటికి.. రాకపోకలు సాగిస్తుండడంతో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశాలున్నాయన్నారు. నగరంలో 80 మేజర్ చెక్ పోస్టులు, 35 మైనర్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనవరంగా రోడ్లమీదకు వచ్చిన 5000 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. లాక్ డౌన్ నిబంధనలను భేఖాతరు చేసిన 7000 మందికి పైగా కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలను కాపాడడానికి నగరంలో 14 వేల మంది పోలీసు సిబ్బంది రోజుకు 24 గంటలు పని చేస్తున్నారన్నారు. పోలీసులు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ప్రజల రక్సణ కోసం రౌండ్ ది క్లాక్ పని చేస్తున్నారని అంజనీకుమార్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తమతో పాటు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు.