మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

నిరాడంబరంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు….

నిరాడంబరంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…
  • అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్
  • ఈనెల 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వే…
  • ముందుగా వ్యవసాయ భూములు..తర్వాత పట్టణ భూముల సర్వే
  •  పైలట్ ప్రాజెక్టు కింద 27 గ్రామాల ఎంపిక
  • 3 గ్రామాలను గజ్వేల్ నియోజకవర్గం నుంచి..
  • మరో 24 గ్రామాలను 24 జిల్లాల నుంచి ఎంపిక

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం నిరాడంబరంగా జరిగాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 ఏళ్లు పూర్తి చేసుకుని 8వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్రంలో వేడుకలు సాదాసీదాగా జరిగాయి. ఎంతో వైభవంగా కన్నుల పండువగా జరగాల్సిన వేడుకలు ఎలాంటి హడావుడి లేకుండా నిరాడంబరంగా జరిగాయి. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ అమలు నేపథ్యంలో ఈసారి ఆవిర్బావ వేడుకల్లో పార్టీ నాయకులు,అభిమానులు,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొనలేక పోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి చేరుకుని అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొని అమర వీరుల ఆత్మకు శాంతి కలగాలని కోరారు. ప్రగతి భవన్ లో జరిగిన వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తదితరులు తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలిపారు. ఇక తెలంగాణ భవన్ లో జరిగిన  వేడుకల్లో కే.కేశవరావు పాల్గొనగా..రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన వేడుకల్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తో పాటు జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. మరో కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు తదితరులు పాల్గొని పతాకావిష్కరణ చేశారు. బీఆర్కే భవన్ లో జరిగిన ఆవిర్బావ వేడుకల్లో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వే…

రాష్ట్రంలో భూముల పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ముందుగా వ్యవసాయ భూముల పరిరక్షణ కోసం పైలట్ డిజిటల్ సర్వే నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభించడానికి కార్యాచరణ రూపొందించినట్లు సీఎం తెలిపారు. బుధవారం ప్రగతి భవన్ లో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. డిజిటల్ పైలట్ సర్వేకు తీసుకోవాల్సిన చర్యలు, విధి విధానాలను సీఎం కేసీఆర్ వారికి వివరించారు. సర్వే నిర్వహించే ఏజెన్సీ ప్రతినిధులకు పలు సూచనలు,సలహాలు అందజేశారు. ఎట్టిపరిస్థితుల్లో రైతులకు

నష్టం కలగకుండా చూడాలన్నారు. సర్వే వ్యాపార ధోరణితో నిర్వహించ రాదన్నారు. ముందుగా వ్యవసాయ భూములపై పైలట్ డిజిటల్ సర్వే నిర్వహిస్తున్నందుకు రైతులకు సంబంధించిన సెంటు భూమి కూడా మిస్ కాకుండా చూడాలన్నారు. వ్యవసాయ భూముల సర్వే అనంతరం పట్టణ భూముల సర్వే జరుగుతుందన్నారు. ఇప్పటికే ధరణి పోర్టల్ ద్వారా ఆశించిన ఫలితాలు వస్తున్నాయన్నారు. ఈ నెల 11 నుంచి నిర్వహించే సర్వే సందర్భంగా రాష్ట్రంలో 27 గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోవాలన్నారు. ఇందులో గజ్వేల్ నియోజకవర్గం నుంచి 3 గ్రామాలను ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్, రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ కు సూచించారు. అలాగే మిగిలిన 24 గ్రామాలను రాష్ట్రంలోని 24 జిల్లాల నుంచి ఎంపిక చేయాలన్నారు. రాబోయే తరాలకు భూ తగాదాలు రాకుండా ఈ వ్యవసాయ భూ సర్వే ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గత పాలకులు నిర్లక్ష్యంగా వదిలేసిన సమస్యలలో భూ సర్వే కూడా ఉందన్నారు. ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో రైతులు భూ తగాదాలతో విసిగిపోయు ఉన్నారన్నారు. ముందుగా వ్యవసాయ భూముల సర్వే జరుగుతుందని.. అనంతరం పట్టణ భూముల సర్వే జరుగుతుందన్నారు. పూర్వకాలంలో అంటే.. ఆదిమానవులప్పడు భూములపై అంతగా ఎవరికి హక్కులు లేవన్నారు. వ్యవసాయం చేయడం ప్రారంభమైనప్పటి నుంచి భూములపై మనుషులకు భూ హక్కులు కలిగాయన్నారు. దళారుల బెడద లేకుండా భూ సర్వే కొనసాగుతుందన్నారు. సర్వే ఏజెన్సీలకు సంబంధిత జిల్లా కలెక్టర్ తో పాటు ఎమ్మెల్యే,ఎంపీలు పూర్తిగా సహకరిస్తారన్నారు. సర్వేకు ముందుగా గ్రామ సభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు.