మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

సీఎం ఆదేశాల తో రంగంలోకి పోలీసులు..

సీఎం ఆదేశాల తో రంగంలోకి పోలీసులు..
  • ఉదయం 10 తర్వాత రాకపోకలపై కట్టడి
  • కేసుల నమోదు..వాహనాలు స్వాధీనం
  • పది గంటలకే చెక్ పోస్ట్ ల మూసివేత
  • ఈ-కామర్స్ సేవలకు అనుమతి ఉన్నా..ఖాతరు చేయని పోలీసులు
  • లబోదిబోమన్నఫుడ్ డెలివరి బాయ్స్..

ఆర్సీ న్యూస్ (హైదరాబాద్ ): పది గంటల పది నిముషాల తర్వాత పాస్ లున్నవారు తప్పా..ఇంకెవరూ రోడ్లపై కనిపించరాదని సీఎం  ఆదేశాల మేరకు రాష్ట్ర పోలీసులు శనివారం పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. అనుమతి లేని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసులు నమోదు చేశారు.

శనివారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కొనసాగిన సడలింపు సమయంలో కూడా స్థానిక పోలీసులు రద్దీ ఎక్కువగా ఉన్న మార్కెట్ లపై దృష్టి సారించారు. గుంపులు, గుంపులుగా వినియోగదారులు దుకాణాల వద్ద గుమిగూడకుండా చర్యలు తీసుకున్నారు.  సడలింపుల అనంతరం ప్రతిరోజు ఉదయం 10.10 గంటలకు రోడ్డుపై ఎవరు ఉండకుండా కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు డీజీపీ తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించడంతో పోలీసు బాస్ లు అప్రమత్తమయ్యారు.

జోమాటో,స్విగ్గీ డెలివరీ బాయ్స్ ను హైదరాబాద్ నగరంలో పోలీసులు అడ్డుకున్నారు

  •  ఇష్టానుసారంగా రోడ్లపైకి గుంపులు, గుంపులుగా వస్తే..ఇక లాక్ డౌన్ అమలు చేసి ఏం ప్రయోజనమని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసిన నేపధ్యంలో శనివారం లాక్ డౌన్ సడలింపు అనంతరం పోలీసులు వెంటనే రంగం లోకి దిగారు.
  • అవసరం లేకున్నా రోడ్లపైకి వచ్చిన వారికి లాఠీల రుచి చూపించారు.
  •  చాలా చోట్ల పోలీసులు అతిగా వ్యవహరించారు.
  • జోమాటో,స్విగ్గీ డెలివరీ బాయ్స్ ను హైదరాబాద్ నగరంలో పోలీసులు అడ్డుకున్నారు.
  • ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఫుడ్ డెలివరి సర్వీసులను అడ్డుకోవడంతో అంతా విస్తుపోయారు.
  •  నల్గొండ జిల్లాలో విద్యుత్ కార్మికులను అడ్డుకుని లాఠీలతో చితకబాది నట్లు ఫిర్యాదులు అందాయి.
  • వాస్తవానికి ఇటీవల లాక్ డౌన్ అమలు కోసం విడుదల చేసిన జీవోె 102లో (4)లో 17వ పాయింట్ కింద ఈ-కామర్స్ సేవలకు (ఫుడ్, ఫార్మాస్యూటికల్స్, మెడికల్ ఇక్విప్మెంట్) అనుమతి ఉంటుందని తెలిపారు.
  • దీంతో గత కొన్ని రోజులుగా డెలివరి బాయ్స్ ఆన్లైన్ ఆర్డర్ లపై ఫుడ్ డెలివరీ చేస్తున్నారు.
  •  విషయం తెలుసుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి తో పాటు ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు తదితరులు వెంటనే స్పందించి విద్యుత్ కార్మికులను అడ్డుకోవద్దని ఆదేశించారు.
  • అలాగే ఫుడ్ డెలివరీ బాయ్స్ ను అడ్డుకోవడం పట్ల హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన ట్విటర్ ద్వారా అసంతృప్తి వ్యక్తం చేశారు.
  • ఎట్టిపరిస్థితుల్లో లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేసి తీరాల్సిందేనని డీజీపీ మహేందర్ రెడ్డి కచ్చితంగా చెప్పడంతో శనివారం ఉదయం పోలీసులు నిర్దయగా వ్యవహరించారు.
  • కచ్చితంగా లాక్ డౌన్ అమలు కోసం పని చేస్తున్నారు.

స్వయంగా రంగంలోకి దిగిన డీజీపీ మహేందర్ రెడ్డి..

  •  రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ ఎం భగవత్ తో కలిసి డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా లాక్ డౌన్ అమలు తీరును పరిశీలించారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సడలింపు సమయంలో మీకు దగ్గరలో ఉన్న మార్కెట్ లకు మాత్రమే వెళ్లి అవసరమైన నిత్యావసర వస్తువులను ఖరీదు చేస్తే..సమయం ఆదా అవుతుందన్నారు.
  • అనసవరసంగా రోడ్లపైకి వస్తే..వాహనాలు స్వాధీనం జరుగుతుందని..వాటిని లాక్ డౌన్ అనంతరం అప్పగించడం జరుగుతుందన్నారు.
  • ఉదయం 9.30 గంటలకే వ్యాపార సముదాయాలను మూసి వేసే ప్రయత్నం చేస్తే..పది గంటల లోపే అంతా ఇళ్లకు చేరడానికి వీలు కలుగుతుందన్నారు.
  • లాక్ డౌన్ లోని 4 గంటల సడలింపును సద్వినియోగం చేసుకోవాలన్నారు.
  • రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు గూడ్స్ వెహికల్ లోడింగ్..అన్లోడింగ్ లకు అనుమతి ఉంటుందన్నారు.
  •  ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సరుకు రవాణా వాహనాలు రోడ్లపైకి రావద్దన్నారు.
  • అనుమతి ఉన్న పరిశ్రమల యాజమాన్యాలు తమ షిప్టులను లాక్ డౌన్ సడలింపు సమయాల్లో మార్చుకోవాలన్నారు.
  • ఈ విషయమై సంబంధిత పోలీసు అధికారులు తమ పరిధిలోని పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడాలన్నారు.
  • సడలింపుల అనంతరం హైదరాబాద్, వరంగల్ నగరాల ఎంట్రీ,ఎగ్జిట్ పాయింట్స్ అన్నీ మూత పడతాయన్నారు.