ఏప్రిల్ 19, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

రోడ్లు బావుంటే..నగరాభివృద్ది బావుంటుంది: కేటీఆర్

రోడ్లు బావుంటే..నగరాభివృద్ది బావుంటుంది: కేటీఆర్

 

  • శేరిలింగంపల్లిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి లింక్ రోడ్డు ప్రారంభం
  • మొదటి దశ కింద 133 లింక్ రోడ్ల ఏర్పాటుకు శ్రీకారం
  • ఇందులో ఇప్పటికే 22 లింక్ రోడ్లు పూర్తి.
  • ఇంకా 17 రోడ్లు పూర్తి అవుతున్నాయి.
  • ఎస్ఆర్ఢీపీ కింద రూ.6000 కోట్లు..
  •  సీఆర్ఎంపీ కింద రూ.1800 కోట్లు
  • హెచ్ఆర్డీసీఎల్ కింద 313 కోట్ల 65 లక్షల రూపాయల నిధుల కేటాయింపు

ఆర్సీ న్యూస్,జూన్ 28 (హైదరాబాద్): దేశంలో మొదటి సారి పెద్ద ఎత్తున లింక్ రోడ్లు నిర్మిస్తున్న నగరం..హైదరాబాద్ అని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సోమవారం శేరిలింగంపల్లిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి లింక్ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రోడ్లు బావుంటే..నగరాభివౄద్ది వేగంగా జరుగుతుం దన్నారు. తమ ప్రభుత్వం రహదారుల అభివౄద్ది కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రహదారుల అభివౄద్ది కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేయడానికి సిద్దంగా ఉన్నామన్నారు. నగరంలోని జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్ పరిధిలో ఇప్పటికే పలు లింక్ రోడ్లను అభివౄద్ది చేశామన్నారు. నగరంలో రద్దీని తగ్గించడంతో పాటు కాలుష్యం పెరగకుండా ఉండేందుకు రహదారుల అభివౄద్ది చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా శేరిలింగంపల్లిలో ఈ రోజు లింక్ రోడ్డును ప్రారంభించామన్నారు. దేశంలో తొలిసారిగా 4 లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టి అందుబాటులోకి తెచ్చామన్నారు. తమ వద్ద జరుగుతున్న రోడ్ల పనుల పట్ల చుట్టు పక్కల రాష్ట్రాల అధికారులు తమ అధికారులకు ఫోన్లు చేసి వివరాలను అడిగి తెలుసుకుంటున్నా రన్నారు. మొన్నటికి మొన్న ముంబాయి నుంచి మన సీఈఓ కు ఫోన్ చేసి మీ వద్ద రోడ్లు చక్కగా ఉన్నాయని..వాటిని పరిశీలించడానికి హైదరాబాద్ వస్తామని అక్కడి అధికారులు చెప్పారని మంత్రి కేటీఆర్ అన్నారు. మొదటి దశ కింద 133 లింక్ రోడ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. ఇందులో ఇప్పటికే 22 లింక్ రోడ్లు పూర్తయ్యాయని.. ఇంకా 17 రోడ్లు పూర్తి అవుతున్నాయన్నారు. దీంతో నగరంలో మొదటి దశ రోడ్లు పూర్తవుతాయన్నారు. ప్రధాన రోడ్లకు చివరన లింక్ రోడ్లు అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు పడరాని పాట్లు పడుతున్నారని..వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని లింక్ రోడ్ల ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎస్ఆర్ఢీపీ కింద రూ.6000 కోట్లు, సీఆర్ఎంపీ కింద రూ.1800 కోట్లతో నగరంలో రహదారుల బాగు కోసం కేటాయించామన్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) కింద 313 కోట్ల 65 లక్షల రూపాయల నిధులతో 24.3 కిలో మీటర్ల రోడ్డు ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. ఇందులో ఇప్పటికే 16 కిలో మీటర్ల దూరాన్ని పూర్తి చేశామన్నారు. మిగిలిన రోడ్డును నెల రోజుల్లో పూర్తి చేసేటట్లు తగిన చర్యలు తీసుకుంటు న్నామన్నారు. రెండవ దశ కింద రూ.232 కోట్ల నిధులతో 13 రోడ్ల పనులను చేపడతామన్నారు. హైదరాబాద్ నగరంలో తొలిసారి చేపట్టిన లింక్ రోడ్డును సకాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చామన్నారు. రహదారులు బావుంటేనే..నగరం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందన్నారు. ప్రధాన రోడ్లకు చివరన లింక్ రోడ్లు లేకపోవడంతో రవాణా సమస్యలు ఎదురవుతున్నాయన్నారు.రహదారులు చక్కగా ఉంటే రవాణా సౌకర్యాు మెరుగవుతాయన్నారు. వివిధ దశల్లో లింక్ రోడ్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే శేరిలింగంపల్లి జోన్ పరిధిలో పలు రోడ్లను బాగు చేయించామన్నారు. నగరంలోని ప్రజలు ఇక్కడ జరుగుతున్న అభివౄద్ది పనుల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎస్ఆర్డీపీలో భాగంగా హైదరాబాద్ నగరంలో ప్లై ఓవర్ నిర్మాణాలతో పాటు అండర్ పాస్ వే లను నిర్మిస్తున్నామన్నారు. నగరంలో పెరుగుతున్నజనాభా,జన సాంద్రతను ద్రుష్టిలో ఉంచుకుని రోడ్ల నిర్మాణాలను కొత్తగా చేపడుతున్నామన్నారు. నగరాన్ని అన్ని రంగాల్లో విస్థరించడానికి నిరంతరం పని చేస్తున్నామన్నారు. నగరంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే ఇండస్ట్రీయలిస్టులకు నగర రోడ్లు ముందుగా స్వాగతం పలుకుతాయన్నారు. ఇక, వసంత సిటీ వద్ద నిర్మించిన లింక్ రోడ్డు ప్రారంభించి వెళుతున్న సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ కు చెందిన పారిశుద్య కార్మికురాలు సైదమ్మను మంత్రి కేటీఆర్ పలకరించారు.

జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ కు చెందిన పారిశుద్య కార్మికురాలు సైదమ్మను మంత్రి కేటీఆర్ పలకరించారు.
సైదమ్మ ధరించిన టోపీ బావుందంటూ సవరించారు.

 నెలనెలా జీతం సక్రమంగా వస్తుందా..నెలకు ఎంత వస్తుంది..అని కేటీఆర్ అడగ్గా..మీరు వచ్చాక రెండు సార్లు జీతాలు పెరిగాయని సైదమ్మ బదులిచ్చింది. వెంటనే స్పందించిన కేటీఆర్ రెండు సార్లు కాదమ్మా..మూడు సార్లు పెరిగాయని చెప్పిన ఆయన సైదమ్మతో కలిసి ఫోటోలకు ఫోజిచ్చారు.