మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఉద్యోగాల దొంగలున్నారు..మోసపోవద్దూ.. జాగ్రత్త..!

ఉద్యోగాల దొంగలున్నారు..మోసపోవద్దూ.. జాగ్రత్త..!
  • ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా..
  • ఉద్యోగాలు ఇస్తామంటూ 241 మంది నిరుద్యోగులను మోసం చేసిన భార్య భర్తలు..
  • స్కౌట్స్ మాస్టర్, గైడ్ క్యాప్టెన్.. ఉద్యోగాలంటూ నిరుద్యోగుల నుంచి లక్షల వసూలు..
  • బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన వరంగల్ పోలీసులు..
  • భార్యాభర్తల అరెస్ట్.. వారి వద్ద నుంచి రూ. 21.7 లక్షల నగదు స్వాధీనం..
  • ఉద్యోగాలు ఇస్తామంటూ చేసే ప్రకటనల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలన్న వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి..

 ఆర్సీ న్యూస్, నవంబర్ 22 (హైదరాబాద్): ప్రస్తుతం నిరుద్యోగులు జీవనోపాధి కోసం ఉద్యోగాల అన్వేషణలో తలమునకలై తిరుగుతున్నారు. ఉన్నత విద్యాభ్యాసం చేసిన నిరుద్యోగులు జీవనోపాధి కోసం ప్రైవేటు ఉద్యోగాల తో పాటు ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించుకోవడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ అందుబాటులో లేనప్పటికీ.. కనీసం ప్రైవేటు ఉద్యోగాలు సాధించుకోవడానికి నిరుద్యోగులు పడుతున్న బాధలు అంతో..ఇంతో కాదు. నిరుద్యోగ సమస్యను ఆసరాగా తీసుకుంటున్న కొంత మంది అక్రమార్కులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నకిలీ ఉత్తర్వులను చేతుల్లో పెట్టి లక్షలకు లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇటువంటి బోగస్ సంస్థల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఉద్యోగం ఇస్తామంటూ డబ్బులు వసూలు చేసేవారి పూర్తి వివరాలను తెలుసుకొని.. సరైనదేనని నిర్ధారించుకున్న అనంతరమే  కార్యాచరణ చేసుకోవాలని కోరుతున్నారు. నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో నిలువునా దోచుకున్న భార్య భర్తల ఉదంతం వరంగల్ జిల్లాలో వెలుగు చూసింది. బాధితుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన కిలాడీ ఫ్యామిలీని అరెస్టు చేశారు. వరంగల్ కమిషనరేట్ పరిధితో పాటు చుట్టు ప్రక్కల జిల్లాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగు వద్ద డబ్బులు వసూళ్ళకు పాల్పడిన నలుగురు సభ్యుల ముఠాలోని ముగ్గురు నిందితులను టాస్క్ ఫోర్స్  పోలీసులు సొమవారం అరెస్టు చేయగా..మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో వున్నాడు. అరెస్టు చేసిన భార్యాభర్తల నుండి 21 లక్షల 70వేల రూపాయల నగదు, రెండు ఖరీదైన కార్లతో పాటు రెండు సెల్‌ఫోన్లు, నకిలీ గుర్తింపు కార్డులు, ఇతర నకిలీ పత్రాలు మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగానికి సంబంధించిన బెల్ట్, టోపీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో… హన్మకొండ జిల్లా, శాయంపేట మండలం..మైలారం గ్రామానికి చెందిన చల్లా వినయ్ పాల్ రెడ్డి(37), అతని భార్య అనసూయ తో పాటు లావుడ్యా నవీన్ సాకేత్( 27) ఉన్నారు. సాకేత్ పాశిగడ్డ తండా గ్రామం, చిట్యాల మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన వారు కాగా…మరో నిందితుడు రాజ్ కె.పి.సిన్హా ప్రస్తుతం పరారీలో వున్నాడు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఒకడైన వినయ్ పాల్ రెడ్డికి 2009 సంవత్సరంలో వి.ఆర్.ఓగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరిన నిందితుడు వినయ్ పాల్ రెడ్డి ములుగు జిల్లా బండారు పల్లె గ్రామ వి.ఆర్.ఓ విధులు నిర్వహించే వాడు. నిందితుడికి ఇదే సమయంలో ములుగు రెవెన్యూ విభాగం ఆవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న  అనసూయతో పరిచయం కావడంతో ఇరువురుకి గతంలో పెళ్ళిళ్ళు అయిన వీరు ఇరువురు కొద్ది కాలం సహజీవనం చేసి వివాహం

చేసుకున్నారు. నిందితులిద్దరు రెవెన్యూ విభాగంలో ఉద్యోస్తులు కావడంతో.. నకిలీ దస్తావేజులు, డాక్యూమెంట్లను తయారు చేసి అవినీతికి పాల్పడటంతో 2012 సంవత్సరంలో నిందితులపై ములుగు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కావడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల నుండి తొలగించబడ్డారు.

కొద్ది కాలం అనంతరం నిందితులకు నకిలీ జాతీయ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ ఇండియా విభాగం కమిషనర్ రాజ్ కె.పి.సిన్హా అనే వ్యక్తితో ఢిల్లీలో పరిచయం అయింది. ఇతని ద్వారా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ ఇండియా విభాగం పేరుతో నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుండి డబ్బులు వసూళ్ళ పాల్పడేందుకు నిందితులు ప్రక్కా ప్రణాళికను రూపొందించుకున్నారు. ఇందులో భాగంగా నిందితుల్లో ప్రధాన నిందితుడైన వినయ్ పాల్ రెడ్డి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ ఏ.పి విభాగం, భార్య అనసూయను స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ విభాగానికి కమిషనర్లుగా…మరో నిందితుడు సాకేతను అసిస్టెంట్ కమిషనర్‌గా నకిలీ హోదాలతో నిరుద్యోగులను మోసంచేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ ఇండియా ద్వారా జిల్లా ఆర్గనైజేషన్ కమిషనర్, స్కౌట్ మాస్టర్, గైడ్ కెప్టెన్ ఉద్యోగ నియామాలను చేపట్టడం జరుగుతుందని ప్రచారం చేయడంతో నిరుద్యోగులు ఉద్యోగాన్ని బట్టి ఒక్కోక్క నిరుద్యోగి నుండి సుమారు 5 లక్షల నుండి 3లక్షల వరకు డబ్బులు వసూళ్ళకు పాల్పడ్డారు. కొద్ది కాలం అనంతరం 2019 ఆగస్టు నుండి గత సంవత్సరం ఆగస్టు వరకు 241 మంది నిరుద్యోగులను వరంగల్, నల్గొండ ప్రాంతాల్లో 15 రోజుల పాటు శిక్షణ అందజేసి శిక్షణ అనంతరం వరంగల్, నర్సంపేట్, నెక్కోండ, హన్మకొండ, నల్గొండ, మంచిర్యాల్, ములుగు, కరీంనగర్ జిల్లా లోని వివిధ పాఠశాల్లో విధులు నిర్వహిం చాల్సిందిగా నకిలీ ఉత్తర్వులను అందజేసారు. ఈ నకిలీ ఉత్తర్వులతో ఆయా ప్రాంతాలకు విధులు నిర్వహించేందుకు ఉత్సహంగా వెళ్ళిన నిరుద్యోగులకు ఈ ఉత్తర్వులు నకిలీ అని తెలియడంతో కంగుతిన్నారు. దీంతో బాధిత నిరుద్యోగులు ఈ ముఠా సభ్యులను నిలదీయటంతో పాటు తాము ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాల్సిందిగా నిందితులపై నిరుద్యోగులకు ఒత్తిడి చేయడంతో నిందితులు నిరుద్యోగులను బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితుల నుంచి ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ముగ్గురు నిందితులను విచారించగా వారు పాల్పడిన మోసాలను అంగీకరించారు.

నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఏఎస్పీ వైభవ్ గైఖ్వాడ్, టాస్క్ ఫోర్స్ ఇన్స్ స్పెక్టర్, మట్వాడా ఇన్స్‌స్పెక్టర్ గణేష్, ఎస్.ఐ అశోక్ శ్రీనివాస్ జీ, సంతోష్, హెడ్ కానిస్టేబుళ్ళు శ్యాంసుందర్, శ్రీకాంత్, లియాఖత్ ఆలీ, సృజన్,మహేందర్, శ్రీనివాస్లను పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అభినందించారు. పరారీలో ఉన్న మరో నిందితుని కోసం గాలిస్తున్న వరంగల్ పోలీసులు ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడే మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.