areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

పాతబస్తీలో ఒమిక్రాన్ పేషెంట్..

పాతబస్తీలో ఒమిక్రాన్ పేషెంట్..
  • వెంటనే స్పందించిన వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు..
  • ఈ నెల 12న దుబాయ్ నుంచి పాతబస్తీకి చేరిన 30 ఏళ్ల యువకుడు..
  • శంషాబాద్ ఎయిర్ ఫోర్టులో వైద్య పరీక్షలు..
  • ఈనెల 16న ఒమిక్రాన్ పాజిటివ్ అంటూ రిపోర్టులు..
  • వెంటనే పేషెంట్ ను ట్రిమ్స్ కు తరలించి వైద్య సేవలు అందజేస్తున్న వైద్యులు

 ఆర్సీ న్యూస్, డిసెంబర్17 ( హైదరాబాద్): విదేశాల నుంచి వస్తున్న వారు తమ వెంట ఒమిక్రాన్ వైరస్ ను తీసుకొస్తున్నారని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. నగరంలోని పాతబస్తీలో మరో ఒమిక్రాన్ వైరస్ వెలుగు చూసింది. 30 ఏళ్ల యువకుడికి పాజిటివ్ రిపోర్టులు రావడంతో వెంటనే స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తగిన చర్యలు తీసుకున్నారు. ఈనెల 12వ తేదీన శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మహమ్మద్ నజీర్ కు వైద్య పరీక్షలు నిర్వహించగా ఈనెల 16వ తేదీన ఒమిక్రాన్ పాజిటివ్ వైరస్ అంటూ రిపోర్ట్ రావడంతో పేషెంట్ ను గచ్చిబౌలిలోని ట్రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈనెల 12వ తేదీన మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంజేషా లోని గురాన్ గల్లికి చెందిన మహమ్మద్ నజీర్ ఈనెల 16వ తేదీ వరకు అపోలో ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నారు. ఇంట్లో ఉంటూ వైద్యుల సలహాలు, సూచనల మేరకు వైద్య సేవలు పొందుతున్నారు. విదేశాల నుంచి స్వదేశానికి చేరుకున్న వారందరినీ కొద్ది రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచుతున్నారు. ఎయిర్ పోర్ట్ అధికారులు శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వైద్య పరీక్షల్లో తేలే రిఫోర్టుల కనుగుణంగా ప్రయాణికుల అందరినీ గుర్తిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈనెల 12వ తేదీన దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న మహమ్మద్ నజీర్ శాంపిల్ సేకరించి డయాగ్నోస్టిక్ సెంటర్ కు పంపించి వైద్య పరీక్షలు నిర్వహించగా ఈనెల 16వ తేదీన ఒమిక్రాన్ వైరస్ సోకినట్లు రిపోర్టులు అందాయి. వెంటనే స్పందించిన దారుషిఫా యు పి హెచ్ సి వైద్యాధికారులు అతని కుటుంబ సభ్యులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగిటివ్ రిపోర్టర్లు వచ్చినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా వారి పరిసర ప్రాంతాల్లోని ప్రజలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో పిచ్ కారి చేయించారు. మీర్ చౌక్ పోలీసులు తగిన బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ వచ్చేసింది. నగరంలో ఆల్రెడీ రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కెన్యా, సోమాలియా తదితర దేశాల నుంచి ఇద్దరు నగరానికి చేరుకోగా..వారి శాంపిళ్లను పరీక్షించగా..ఒమిక్రాన్ పాజిటివ్ గా రిజల్ట్ వచ్చినట్లు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ఇప్పటికే వెల్లడించారు. ఈనెల 12వ తేదీన మెహిదీపట్నంలోని టోలి చౌకి ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల మహిళ కెన్యా నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగింది. వెంటనే శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్ కు పంపగా ఒమిక్రాన్ వైరస్ అని నిర్ధారణ కావడంతో వైద్య చికిత్సల కోసం ఆమెను గచ్చిబౌలిలోని ట్రిమ్స్ కు తరలించారు. అదేవిధంగా సోమాలియా నుంచి వచ్చిన 23 ఏళ్ల మరో యువకునికి సైతం ఒమిక్రాన్ వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. వెంటనే వీరిరువురికీ ట్రిమ్స్ లో వైద్య సేవలు అందిస్తూనే వారి కుటుంబ సభ్యులను ఐసోలేషన్ లో ఉంచారు. ప్రపంచంలోని దాదాపు 77 దేశాల్లో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 8 ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ కావడంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని… ప్రజలు ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ తెలిపారు. ఒమిక్రాన్ తో  పాటు కొత్త వైరస్ లు ఏవి నిర్ధారణ అయినా.. వాటన్నింటినీ ఎదుర్కోవడానికి వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందన్నారు. క్రిస్మస్ వేడుకలతో పాటు సంక్రాంతి పర్వదినం కూడా ఉందని.. జనవరి మూడో వారం నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు పరిస్థితులు భయాందోళన కలిగించే విధంగా ఉంటాయని అంటున్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కూలు ధరించాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. మాస్కులు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో బయట తిరగరాదన్నారు. ఇంటా బయటా తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉందన్నారు.