areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ప్రతి జిల్లా కేంద్రంలో ‘నీరా కేఫ్’ లు…

ప్రతి జిల్లా కేంద్రంలో ‘నీరా కేఫ్’ లు…
  • ట్యాంక్ బండ్ పై రూ. 20 కోట్లతో నీరా కేఫ్..
  • గౌడ సామాజిక వర్గానికి కేసీఆర్ అభయ హస్తం పథకం ప్రారంభం..
  • గౌడ కులస్తులు ఆత్మ గౌరవంతో బతుకుతారు
  • 588 మందికి రూ.13.96 కోట్ల ఎక్స్ గ్రేషియా …
  • రవీంద్రభారతిలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్.

ఆర్సీ న్యూస్,జూలై 8 (హైదరాబాద్): నగరంలోని ట్యాంక్ బండ్ పై రూ. 20 కోట్లతో నీరా కేఫ్ ఏర్పాటు చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నరు. బుధవారం రవీంద్ర భారతిలో కల్లు గీత వృత్తి దారులకు కేసీఆర్ అభయ హస్తం కార్యక్రమాన్ని ఆయన మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన కేసీఆర్ అభయ హస్తం పథకంలో భాగంగా బుధవారం ప్రమాదావశాత్తు మరణించిన కల్లు గీత వృత్తి దారులకు ఎక్స్ గ్రేషియా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం కేసీఆర్ అభయ హస్తం పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఇందులో భాగంగా కల్లు గీత కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి నిధులు అందుబాటులో ఉంటాయన్నారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై నీరా కేఫ్ ను ప్రారంభించడానికి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి అవుతున్నాయన్నారు. నీరా ఆరోగ్యానికి మంచిదన్నారు. ఎలాంటి మత్తు పదార్దాలు గానీ..శరీరానికి హాని కలిగించే పదార్ధాలు గనీ..నీరాలో ఉండవన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేఫ్ లను తెరుస్తామని ఆయన వెల్లడించారు. కల్లు గీత కార్మికులు ఆత్మ గౌరవంతో బతుకుతారన్నారు. లక్షలు సంపాదించకున్నా..కుటుంబ సభ్యులతో కలసి సమాజంలో గౌరవంగా బతుకుతారన్నారు. ఇతరులను గౌరవంగా చూస్తునే..తమ గౌరవాన్ని కాపాడుకునే కల్లు గీత వృత్తిదారులు సమాజంలో వివాద రహితులుగా జీవిస్తున్నారన్నారు. వీరిని ఆర్దికంగా ఆదుకోవడానికి మఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. కేవలం కల్లు గీసే వృత్తిపై ఆధార పడిన కల్లు గీత కార్మికుల సౌకర్యార్ధం ప్రత్యేక జీవో తెచ్చామన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కేవలం గౌడ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలే కల్లు గీసే విధంగా జీవో తెచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. త్వరలో గౌడ కులస్తుల కోసం కోకాపేటల్ గౌడ భవన్ నిర్మిస్తామన్నారు. ఇందు కోసం ఇప్పటికే రూ. కోట్లు మంజూరయ్యయన్నారు. అన్ని రకాల సౌకర్యాలతో అత్యంత అధునాతనంగా గౌడ భవన్ నిర్మణం జరుగుతుందన్నారు. గౌడ కులస్తుల సౌకర్యార్ధం ప్రత్యేక డిజైన్ తో తయారు చేయించిన వాహనాలను అందజేస్తా మన్నారు. తల్లిదండ్రులు చనిపోయిన గీత కార్మికుల చిన్నారులు అనాధలు కాకుండా వారిని ఆదుకుంటామన్నారు. వీరు అనాధలుగా మిగలకుండా చేరదీసి ప్రభుత్వ గురుకుల, రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన పురాతన కోటలకు సంరక్షణ చర్యలు చేపట్టి..వాటిని పర్యాటకంగా అభివృద్ది చేస్తామన్నారు. తమ ప్రభుత్వం కుల వ్రుత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు క్రుషి చేస్తుందన్నారు. ప్రతి గ్రామంలో తాటి,ఈత వనాలను పెంచుతామన్నారు. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ…కల్లు ఆరోగ్యానికి మంచిదనే విషయం సాంకేతికంగా నిరూపణ జరిగిందన్నారు. నీరా స్కీం సూపర్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. గౌడ కులస్తుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. అలాగే గౌడ సామాజిక వర్గం సంక్షేమంతో పాటు వారి అభివ్రుద్దికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంతో శ్రద్ద వహిస్తున్నారన్నారు. డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హాయాంలో కల్లు దుకాణాలు మూత పడ్డాయన్నారు. తమ ప్రభుత్వంలో వాటిని తెరిపించిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. మాట తప్పకుండా కల్లు దుకాణాలను తెరిపించామన్నారు.హరిత హారంలో భాగంగా 3.80 కోట్ల తాటి,ఈత మొక్కలను నాటి గౌడ కుల వ్రుత్తిదారులకు చేయూత నిస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. ప్రమాదావశాత్తు మరణించిన కల్లు గీత వృత్తిదారులకు 126 మందికి రూ.5 లక్షలు, శాశ్వత అంగ వైకల్యం పొందిన 147 మందికి రూ. 5 లక్షలు, స్వల్ప అంగవైకల్యం పొందిన 315 మందికి రూ. 10 వేల చొప్పున మొత్తం 588 మందికి రూ.13.96 కోట్ల ఎక్స్ గ్రేషియా అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్,దానం నాగేందర్ తదితరులతో పాటు పలు గౌడ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.