ఏప్రిల్ 19, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈసారి ఘనంగా బోనాల జాతర….

సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈసారి ఘనంగా బోనాల జాతర....

 

  • ఉత్సవాల ఏర్పాట్లు,నిర్వాహణపై శుక్రవారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో మంత్రి తలసాని వెల్లడి
  • ఎంసీఆర్ హెచ్ఆర్డీ లో సమావేశం..పాల్గొన్న మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి 
  • కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూ ఘనంగా బోనాలు జరపాలన్న తలసాని
  • ఫ్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నందున..చందాలు వసూలు చేయొద్దన్న మంత్రి
  • జూలై 11న, గొల్కొండ జగదాంబ అమ్మవారి బోనంతో ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభం

ఆర్సీ న్యూస్,జూన్ 25 (హైదరాబాద్): ఈసారి తెలంగాణలో ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇచ్చిన ఆదేశాల మేరకు ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇందుకోసం అమ్మవారి దేవాలయాల అభివృద్ది, ఉత్సవాల నిర్వాహణ, ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులను మంజూరు చేయనున్నట్లు ఆయనే ప్రకటించారు.సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించే ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాల సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం జరిగింది. ఆషాడ మాసం బోనాల జాతర నిర్వాహణ, ఏర్పాట్లు తదితర అంశాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రం (ఎంసీఆర్ హెచ్ఆర్డీ) లో ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నాం 1.30 గంటల వరకు  అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనీల్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు అంజనీ కుమార్, మహేష్ భగవత్, సజ్జనార్ లతో పాటు వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  ఈసారి జరిగే బోనాల జాతర ఉత్సవాలను ఎలా నిర్వహించాలి.. కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, నిధుల మంజూరు తదితర అంశాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బోనాల జాతర ఉత్సవాల నిర్శాహకులతో చర్చించారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నందున ప్రజల నుంచి చందాలు వసూలు చేయవద్దన్నారు. బోనాల జాతర ఉత్సవాల సందర్బంగా ఎక్కడ ఎలాంటి అసౌ కర్యాలు,శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసులు రౌండ్ ది క్లాక్ బందోబస్తు సేవలను కొనసాగిస్తారని తలసాని తెలిపారు. ఈసారి బోనాల జాతర ఉత్సవాలను ఘనంగా నిర్శహించడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షులు బి.బల్వంత్ యాదవ్ మాట్లాడుతూ..ఉత్సవాల నిర్వాహణకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయనుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రూ.15 కోట్ల నిధులను విడుదల చేయనుండడంతో అమ్మవారి భక్తుల తరఫున సీఎం కేసీఆర్ తో పాటు  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ధన్యవాదాలు తెలిపారు. బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం తరఫున ఉత్సవాల ప్రారంభానికి ముందే తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరారు. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఉపా ధ్యక్షులు కె.ఎస్.ఆనంద్ రావు మాట్లాడుతూ..ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి కార్యాలయానికి శాశ్వత భవనం ఎంతో అవసరం ఉందని..భవన నిర్మాణం కోసం రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే..భావుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరారు. ఈ సమావేశంలో  పాతబస్తీలోని 25 ప్రధాన దేవాలయాలకు చెందిన ప్రతినిధులతో పాటు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి మాజీ అధ్యక్షులు గాజుల అంజయ్య, రాకేష్ తివారి, ప్రవీణ్ కుమార్ గౌడ్, మధుసూదన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.