మార్చి 19, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

దేశానికే ఆదర్శం.. డబుల్ బెడ్ రూమ్ పథకం..

  • లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యం కాగా..
  • ఇప్పటికే 60 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి..
  • ఇరవై మూడు ప్రాంతాల్లో లబ్ధిదారులకు అందజేత..
  • ప్రస్తుతం రూ.27.20 కోట్ల వ్యయంతో బండ మైసమ్మ నగర్ లో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇల్లు..
  • లబ్ధిదారులకు అందజేసిన మంత్రులు 

ఆర్సీ న్యూస్, మే 15 (హైదరాబాద్): పేద ప్రజల కోసం   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర గృహనిర్మాణ, ఆర్ అండ్ బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి  అన్నారు. ఆదివారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ బండ మైసమ్మ నగర్ లో 27.20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్, MLC సురభి వాణి దేవి లతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు పత్రాలు, ఇంటి తాళాలను అందజేశారు. ముందుగా మంత్రులు లబ్ధిదారులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. అంతకుముందు మంత్రులకు కాలనీ వాసులు డప్పుచప్పుళ్ళు, బాణసంచాలతో ఘనస్వాగతం పలికారు. మహిళలు కుంకుమ తిలకం దిద్ది మంగళహారతులు పట్టారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మురికి కూపాలను తలపించేలా ఉన్న బస్టిలలో సరైన వసతులు లేక ఇరుకు ఇండ్లలో పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేద ప్రజలకు అన్ని సౌకర్యాలతో కూడిన ఇండ్లను నిర్మించి వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లబ్ధిదారులపై ఒక్క పైసా భారం పడకుండా ప్రభుత్వమే ఉచితంగా ఇండ్లను నిర్మించి ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు పర్యవేక్షణలో నగరంలో లక్ష ఇండ్లు నిర్మించాలని నిర్ణయించగా ఇప్పటికే 60 వేల ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, అందులో 23 ప్రాంతాలలో ఇండ్లను లబ్ధిదారులకు అందజేసినట్లు చెప్పారు. ఒక్క సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోనే 7 ప్రాంతాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు ఇవ్వడం ఎంతో సంతోషించదగ్గ విషయం అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ KCR కలను నెరవేర్చిన ఘనత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు దక్కుతుందని చెప్పారు. అన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలలో దేవాలయాలను మంత్రి శ్రీనివాస్ యాదవ్ తన సొంత నిధులతో నిర్మించారని, ఇదే స్ఫూర్తితో తన నియోజకవర్గ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలలో కూడా దేవాలయాల నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. గతంలో వేసవిలో త్రాగునీటి కోసం మహిళలు రోడ్లపైకి వచ్చే వారని, నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీటిని అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా పేదలకు ఉచితంగా ఇండ్ల నిర్మాణంతో పాటు వృద్ధులు, వితంతువుల గౌరవం పెంపొందించేలా 200 రూపాయలు ఉన్న పెన్షన్ ను 2116 రూపాయల కు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీర్ కే దక్కుతుందని చెప్పారు. ప్రభుత్వం ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని ప్రకటించారు.

పేద ప్రజలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కోరుకుంటారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. తాను ఇక్కడే పెరిగానని, మీ సాధక బాధకాలు తెలిసిన వాడినని  అన్నారు. మీ కష్టాలను దూరం చేయాలని, మీరు సంతోషంగా ఉండాలనే విశాలమైన అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించినట్లు చెప్పారు. ఇండ్ల నిర్మాణం చేపట్టే ముందు కొంతమందికి అనుమానాలు ఉండేవని, అద్భుతమైన ఇండ్లను నిర్మించి అనుమానాలను పటా పంచలు చేసినట్లు తెలిపారు. ఈ బస్తీలో ఎంతో కాలం నుండి నివసిస్తున్న అర్హులైన వారిని బస్తీ ప్రజల సమక్షంలో బహిరంగంగా గుర్తించి వారందరికీ ఇండ్లను ఇస్తామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఎవరో ఏదో చెబితే వారి మాటలు నమ్మి డబ్బులిచ్చి నష్టపోవద్దని ఆయన హెచ్చరించారు. కాలనీ ప్రజల కోసం ఒక బస్తీ దవాఖాన, ఒక అంగన్ వాడి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.  ఈ కార్యక్రమంలో కలెక్టర్ శర్మన్, కార్పొరేటర్ లు హేమలత, మహేశ్వరి,  సికింద్రాబాద్ RDO వసంత, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వాటర్ వర్క్స్ GM రమణా రెడ్డి, MRO బాల శంకర్, హౌసింగ్ CE సురేష్, EE వెంకట దాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.