మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

రాష్ట్రం లో మరో 10 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగింపు… 

రాష్ట్రం లో మరో 10 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగింపు...
  • జూన్ 9 వరకు అమలులో లాక్ డౌన్..
  • రోజుకు 7 గంటల పాటు సడలింపు..
  • ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు..
  • మరో గంట పాటు ఇళ్లకు చేరడానికి అదనపు సమయం..

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): రాష్ట్రం లో లాక్ డౌన్ ను మరో పది రోజుల పాటు పొడిగించారు. ఆదివారం ప్రగతి భవన్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన జరిగిన సమావేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తీరు, లాక్ డౌన్ పొడిగింపు తదితర అంశాలతో పాటు ఇతర అంశాలను కూడా చర్చించారు. ప్రధానంగా రాష్ట్ర ప్రజలు ఆదివారం ఉదయం నుంచి లాక్ డౌన్ పై వెలువడే ప్రకటన కోసం సాయంత్రం వరకు ఎదురు చూశారు. ఎట్టకేలకు మంత్రి కేటీఆర్ ఆదివారం రాత్రి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రాష్ట్రంలో మరో పది రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అనంతరం కొద్ది సేపటికి సీఎంఓ లాక్ డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ఱయం తీసుకున్నట్లు వెల్లడించింది. జూన్ 9వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఇక ఇప్పటి వరకు ఉన్న 4 గంటల సడలింపు..మే 31వ తేదీ నుంచి అంటే సోమవారం నుంచి 7 గంటల వరకు అమలులో ఉంటుంది. అంతే కాకుండా ఇళ్లకు చేరడానికి మరో గంట అదనంగా అందుబాటులో ఉంటుంది. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు ఉండగా..మరో గంట పాటు అదనంగా కేటాయించడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపు అందుబాటులో ఉంటుంది.

ముందు గత వారం రోజుల తో పోలిస్తే  రాష్ట్రం లో  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండడంతో లాక్ డౌన్ ను మరికొన్ని రోజులు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ఱయం తీసుకుంది. మొదటగా రాష్ట్రంలో ఈ నెల 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం  మే 30వ తేదీ వరకు మరో మారు లాక్ డౌన్ ను పెంచుతూ నిర్ఱయం తీసుకుంది. వాస్తవానికి ఈ నెల 20వ తేదీ క్యాబినెట్ సమావేశం నిర్వహించి లాక్ డౌన్ పై తదుపరి నిర్ఱయం తీసుకోనున్నట్లు ప్రకటించారు. కాగా, అప్పటికే మంత్రులు జిల్లాలో కరోనా వైరస్ కట్టడి చర్యలపై బిజీగా ఉండడంతో 20న నిర్వహించాల్సిన క్యాబినెట్ మీటింగ్ ను రద్దు చేసిన  సీఎం కేసీఆర్ లాక్ డౌన్ పై మరోసారి నిర్ణయం తీసుకున్నారు. మే 30వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇక గత వారం రోజుల తో పోల్చితే పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని… లాక్ డౌన్ కు ముందు కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం మూడు వేల లోపు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని విషయాన్ని వైద్య,ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. లాక్ డౌన్ విధించడంతో పాటు ప్రజలు కరోనా కట్టడికి సరైన జాగ్రత్తలు తీసుకుంటుండడంతో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ ను మరికొన్ని రోజులు పొడిగిస్తే..మరింత ఆశించిన ఫలితాలు వస్తాయని భావించి రాష్ట్ర ప్రభుత్వం మూడో దఫా లాక్ డౌన్ ను జోన్ 9వ తేదీ వరకు  వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏప్రిల్ 20 నుంచి మొదలైన కరోనా కర్ఫ్యూ..మే 12 నుంచి కొనసాగుతున్న లాక్ డౌన్..

రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతుండటంతో హైకోర్టు జోక్యంతో తెలంగాణలో ముందు ఏప్రిల్ 20 నుంచి రాత్రిపూట కరోనా కర్ఫ్యూ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.  ఈనెల 15వ తేదీ వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలులో ఉంది. రాష్ట్రంలో గత నెల 20 వ తేదీ రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అమల్లోకి వచ్చింది. మొదటగా మే 1 వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు అమల్లోకి రాగా..మరో వారం రోజుల పాటు అంటే..ఈ నెల 8వ తేదీ వరకు పొడిగించారు. 8వ తేదీ తెల్లవారుజాముతో రెండో వారం వరకు పొడిగించిన రాత్రిపూట కర్ఫ్యూ గడువు ముగుస్తుంది. దీంతో ఒకరోజు ముందుగా అంటే 7వ తేదీన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాత్రిపూట కర్ఫ్యూ మరో వారం రోజుల పాటు అంటే మే 15వ తేదీ వరకు  పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుండగానే మరోసారి హైకోర్టు జోక్యంతో రాత్రిపూట కర్ఫ్యూ ముగియడానికి రెండు రోజులు ముందుగానే మే 12 నుంచి లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తోంది. ప్రస్తుతం అమలు జరుగుతున్న లాక్ డౌన్ ఈ రోజు(30)తో ముగియనుంది. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ప్రగతి భవన్ లో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో లాక్ డౌన్ ను జూన్ 9వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ఱయం తీసుకున్నారు.అధికారిక లెక్కల ప్రకారం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. కరోనా వైరస్ బారిన పడి వైద్య సేవలు పొంది రికవరి అవుతున్న వారు 90 శాతానికి పైగా ఉంటున్నారని ప్రజా వైద్యారోగ్య శాఖ సంచాలకులు చెబుతున్నారు.  సకాలంలో వైద్య సేవలు పొందడమే కాకుండా కరోనా వైరస్ కట్టడికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న వారందరూ ఎలాంటి టెన్షన్ లేకుండా కోలుకుంటున్నారంటున్నారు. కొంతమంది తమకు కరోనా వైరస్ సోకిందని అనవసరంగా భయాందోళనలకు గురవుతుండటంతో మరణిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. నిలకడగా తమ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పడు పరిశీలించుకుంటూ వైద్యులు సూచించిన సలహాలు, సూచనలతో పాటు అవసరమైన ఐసోలేషన్ మెడికల్ కిట్లు వాడుతూ కోలుకుంటున్నారన్నారు.