areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

లాక్ డౌన్ అమలు తీరును పరిశీలించిన సిటీ సీపీ..

లాక్ డౌన్ అమలు తీరును పరిశీలించిన సిటీ సీపీ..
  • నగరంలోని చెక్ పోస్టుల తనిఖీ చేసిన నగర పోలీసు కమిషనర్
  • మే నెల 31న నగరంలో 6350 కేసులు నమోదు
  • మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిపై 1529 కేసులు..
  •  భౌతిక దూరం పాటించని 251 మందిపై కేసుల నమోదు..
  • అధిక సంఖ్యలో గుమిగూడిన వారిపై 22 కేసులు..
  • పాన్,గుట్కా,టుబాకో రిలేటెడ్ వస్తువుల వినియోగంపై 47 కేసులు..
  • 3574 వాహనాల స్వాధీనం..

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): నగరంలోని పలు ప్రాంతాల్లో అమలు జరుగుతున్న లాక్ డౌన్ ను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం పరిశీలించారు. సెంట్రల్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్ లో అక్కడక్కడ ఇప్పటికే కొనసాగుతున్న చెక్ పోస్టులను తనిఖీ చేసి పరిస్థితిని అంచనా వేశారు. నగరంలో పర్యటించిన ఆయన ఎంజే మార్కెట్,అఫ్జల్ గంజ్, మదీనా,చార్మినార్, మాసాబ్ ట్యాంక్,బంజారాహిల్స్,జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్,నాగార్జున సర్కిల్, తాజ్ క్రిష్ణ,ఖైరతాబాద్,లిబర్టీ, బషీర్ బాగ్ తదితర ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు తీరును స్వయంగా పరిశీలించారు. ట్రాఫిక్ పోలీసులు, సెంట్రల్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రముఖ ఆర్టిస్ట్ రాజన్ స్వామి వేసిన ఆర్ట్ ను కమిషనర్ తిలకించారు. కరోనా వైరస్ మానవుల జీవన విధానాన్ని ఎలా నాశనం చేస్తుందనే విషయాన్ని ఎంజే మార్కెట్ ప్రధాన రోడ్డుపై రాజన్ స్వామి చిత్రించిన చిత్రం ఆకట్టుకుంది. కమిషనర్ వెంట నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ అనీల్ కుమార్, నగర జాయింట్ పోలీసు కమిషనర్ విశ్వప్రసాద్ తదితరులున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజల ప్రశాంతతను తినేస్తున్న విధానాన్ని కళ్లకు కట్టినట్లు ఆయన చిత్రీకరించారు. ఎంతో మంది కుటుంబాల సంతోషాలను కబలించి వేసిన విధానాన్ని ఆయన చిత్రం ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం సడలింపు సమయం పెరిగినందున సద్వినియోగం చేసుకోవాలన్నారు. 1 శాతం మంది ఎలాంటి అత్యవసర పరిస్థితులు లేనప్పటికి.. రాకపోకలు సాగిస్తుండడంతో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశాలున్నాయన్నారు. ఇలాంటి వారిని గుర్తించి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నామన్నారు. పోలీసులు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ప్రజల రక్షణ కోసం రౌండ్ ది క్లాక్ విధినిర్వహణలో ఉంటున్నారన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తమతో పాటు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే నగర ప్రజలు లాక్ డౌన్ అమలు ని చక్కగా పాటిస్తున్నారన్నారు. అందుకే పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. నగరంలో లాక్ డౌన్ పటిష్టంగా కొనసాగుతోందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి కరోనా వైరస్ వ్యాప్తికి బాధ్యులు కావద్దన్నారు. లాక్ డౌన్ విధించిన సమయంలో ఇంటి వద్దే సురక్షితంగా ఉండాలన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ చక్కగా అమలు జరుగుతుందన్నారు. 99 శాతం అన్ని వర్గాల ప్రజలు లాక్ డౌన్ కు సహకరిస్తు న్నారన్నారు. కేవలం 1 శాతం మంది యువకులు కావాలని రోడ్ల మీదకు వచ్చి కరోనా వైరస్ వ్యాప్తికి పాల్పడుతున్నారన్నారు. సకాలంలో వైద్య సేవలు పొందడమే కాకుండా కరోనా వైరస్ కట్టడికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. వైరస్ తో బాధపడుతున్న వారందరూ ఎలాంటి మానసిక ఆందోళనకు గురికావద్దన్నారు. లాక్ డౌన్ ను మరింత పటిష్టంగా అమలు చేస్తే..కరోనా వైరస్ చైన్ ను బ్రేక్ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. కరోనా కట్టడికి రోడ్లపై వాహనాల రాకపోకలను కట్టడి చేస్తున్నామన్నారు. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో మే నెల 31వ తేదీన నగరంలో 6350 కేసులు నమోదు చేశారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిపై 1529 కేసులు, భౌతిక దూరం పాటించని 251 మంది..అధిక సంఖ్యలో గుమిగూడిన వారిపై 22 కేసులు.. పాన్,గుట్కా,టుబాకో రిలేటెడ్ వస్తువుల వినియోగంపై 47 కేసులతో పాటు 3574 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.