ఏప్రిల్ 17, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

పోలీసుల కు ప్రత్యేక కోవిడ్ ఐసోలేషన్ సెంటర్…

పోలీసుల కు ప్రత్యేక కోవిడ్ ఐసోలేషన్ సెంటర్...

ఆర్సీన్యూస్(హైదరాబాద్): కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి తక్కువ లక్షణాలతో బాధపడే పోలీసుల సౌకర్యార్ధం ప్రత్యేకంగా  కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. విధినిర్వహణలో ఎన్నో ఒడిదుడుకు లను ఎదుర్కొంటూ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పని చేస్తున్న పోలీసులలో ఎప్పడో ఒక చోట కరోనా బారిన పడి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి ఎలాంటి తీవ్రమైన లక్షణాలు లేని పోలీసుల కోసం ఈ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ అందుబాటులో ఉంటుంది. ఇందులో చేరే పోలీసులకు రోజుకు మూడు పూటల ఆహారంతో పాటు వైద్య సేవలు అందుతాయి. అత్యంత సౌకర్యవంతమైన ఈ కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్నినగర పోలీస్ కమిషనరేట్ అందుబాటులోకి తెచ్చింది.  సహాయ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శనివారం ఫ్రారంభించారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటి కౌన్సిల్ (హెచ్సీఎస్సీ), హైదరాబాద్ సిటీ పోలీసు సంయుక్తాధ్వర్యంలో పాతబస్తీ పేట్ల బురుజులోని పోలీసు ట్రైనింగ్ సెంటర్లో ఏర్పాటు చేశారు. అతి తక్కువ సమయంలో అత్యంత సౌకర్య వంతంగా..భౌతిక దూరం పాటించే విధంగా ఈ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. పోలీసు ట్రైనింగ్ సెంటర్ ను కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ గా మార్చారు. ఇందులో 10 వార్డులు ఉంటాయి. మొత్తం 50 బెడ్స్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

ప్రత్యేక కోవిడ్ ఐసోలేషన్ సెంటర్...

వీటిలో 5 బెడ్స్ కు ఆక్సీజన్ సౌకర్యం ఉంటుంది. కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ లో కొంత మంది పోలీసులు కరోనా బారిన పడి మరణించగా.. ఎంతో మంది కరోనా వైరస్ సోకి వైద్య చికిత్సలు పొందారు. ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్స్ కోసం కొంత మంది పోలీసులు పడరాని పాట్లు పడ్డారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ లో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా కొనసాగుతుండడంతో..విధినిర్వాహణలోని పోలీసులు ప్రమాదావశాత్తు కరోనా వైరస్ బారిన పడి అతి తక్కువ లక్షణాలు ఉన్నవారికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి శ్రీకారం చుట్టిన నగర పోలీసు కమిషనర్ ఈ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ను పోలీసు ట్రైనింగ్ సెంటర్ లో అందుబాటులోకి తెచ్చారు. కొందరికి జ్వరం మాత్రమే ఉండడం..మరికొందరికి తలనొప్పి.. ఇంకొందరికి జలుబు..ఇలా అతి తక్కువ కోవిడ్ లక్షణాలున్న పోలీసులకు ఈ కోవిడ్ సెంటర్ సౌకర్యవంతంగా ఉంటుందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లో రోగులకు వైద్య సేవలను అందజేయడానికి ముందుకు వచ్చిన నౌషియా ఆసుపత్రి, డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్ పాజిటివ్ ఉన్నప్పటికీ..ఎలాంటి లక్షణాలు లేని పోలీసు ఆఫీసర్లకు ఈ కేంద్రం సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. చాలా మంది ఇళ్లల్లో సీనియర్ సిటిజన్స్ తల్లిదండ్రులు, చిన్నారులు ఉంటారు..కరోనా వైరస్ సోకిన వారికి వీరితో కలిసి హోం ఐసోలేషన్ లో ఉండలేని పరిస్థితులు ఉంటున్నందున..అలాంటి వారి సౌకర్యార్ధం సహాయ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంజనీకుమార్ తెలిపారు. రౌండ్ ది క్లాక్ వైద్య సేవలు అందే ఈ సెంటర్ లో అన్ని సౌకర్యాలు ఉంటాయని ఆయన వివరించారు. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన నగర అదనపు పోలీసు కమిషనర్(క్రైమ్ అండ్ సిట్) షికా గోయెల్, నగర అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) అనీల్ కుమార్, నగర అదనపు పోలీసు కమిషనర్ ( లా అండ్ ఆర్డర్) డీ.ఎస్.ఛౌహాన్లతో పాటు డాక్టర్ పి.ప్రశాంతి, భరని తదితరులను ఆయన అభినందించారు. నౌషియా ఆసుపత్రి, డయాగ్నోస్టిక్ సెంటర్ కు చెందిన డాక్టర్ నౌషియా, డాక్టర్ మాజ్ లకు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అభినందనలు తెలిపారు.హైదరాబాద్ సిటీ సెక్యూరిటి కౌన్సిల్ (హెచ్సీఎస్సీ), హైదరాబాద్ సిటీ పోలీసు సంయుక్తాధ్వర్యంలో ఇప్పటికే ప్లాస్మా డోనేషన్ కార్యక్రమం కొనసాగుతున్న విషయం తెలిసిందేనని ఆయన తెలిపారు.