మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఆక్సీజన్ లీకై 22 మంది కోవిడ్  రోగుల మృతి..

ఆక్సీజన్ లీకై 22 మంది కోవిడ్ రోగుల మృతి

ఆక్సిజన్ లీకేజీ కావడంతో 22 మంది రోగులు మృతి చెందారు.

ఆర్సీ న్యూస్(నాసిక్): మహారాష్ట్ర లోని నాసిక్ లో పెను విషాదం చోటు చేసుకుంది. నాసిక్ లోని డాక్టర్ జాకిర్ హుస్సేన్ హాస్పిటల్ లో ఆక్సిజన్ లీకేజీ కావడంతో 22 మంది రోగులు మృతి చెందారు. ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అధికం కావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించింది. దీనికి తోడు బుధవారం నాసిక్ లోని కోవిడ్‌‌‌-19 ఆసుపత్రిగా కొనసాగుతున్న డాక్టర్ జాకిర్ హుస్సేన్ ఆసుపత్రిలో ఉన్నట్టుండి పెద్ద ఎత్తున ఆక్సిజన్ లీకైంది. దీంతో కోవిడ్ రోగులందరికి అర గంట పాటు ఆక్షిజన్ అంద లేదు. వెంటిలేటర్స్ పై చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులకు ఆక్షీజన్ సరఫరా నిలిచిపోయింది. చాలా మంది రోగులు ఊపిరి ఆడక సతమతమయ్యారు. ప్రాణ వాయువు అందకపోవడంతో లబోదిబోమన్నారు. కొద్దిసేపటి వరకు ఏం జరుగుతుందో ఎవరికి అర్దం కాలేదు. రోగుల ఆర్తనాథలు మిన్నంటాయి. వార్డుల్లో ఉరుకులు..పరుగులు. బెడ్లపై రోగుల రోదనలు..ఎటు చూసినా హ్రుదయ విదారక సంఘటన. ఆక్సీజన్ ట్యాంకర్ ద్వారా ఆసుపత్రిలోని ఆక్సీజన్ ఫ్లాంట్లోకి ఆక్సీజన్ ఫిల్ చేస్తుండగా..ఆక్సిజన్ లీకేజి జరిగినట్లు ప్రాథమికంగా నిర్దారించారు. విషయం తెలిసిన వెంటనే మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టొిపే స్పందించారు. ఆక్సీజన్ లీకేజీ సంఘటన ప్రమాదకరంగా జరిగిందని..దీనిపై శాఖాపరమైన విచారణ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. డాక్టర్ జాకిర్ హుస్సేన్ ఆసుపత్రి నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసీ) ఆధ్వర్యంలో కోవిడ్ ఆసుపత్రిగా కొనసాగుతోంది. బుధవారం జరిగిన ఈ సంఘటనలో 22 మంది చనిపోగా..మరికొంత మందికి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. చనిపోయిన వారిలో 11 మంది మహిళలు, 11 మంది పురుషుల ఉన్నారని తెలుస్తోంది. కాగా ఆసుపత్రిలో దాదాపు 150 మంది వరకు కోవిడ్ పేషంట్స్ వైద్య సేవలు పొందుతుండగా..వెంటిలేటర్ పై ఉన్న రోగులు మాత్రమే ప్రమాదానికి గురైనట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే వైద్య సిబ్బంది హుటాహుటిన సహాయక చర్యలకు పూనుకున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రోగులకు అవసరమైన మేరకు అత్యవసర వైద్య సేవలు అందజేశారు. దాదాపు అర గంట పాటు శ్రమించిన టెక్నీషియన్స్ లీకేజీలను అరికట్టగలిగారు. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ..తిరిగి ఆక్సిజన్ సరఫరాలను పునరుద్దరించారు. ఈ మొత్తం ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు మొదలు పెట్టింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. వెంటిలేటర్ పై ఉన్న రోగికి క్రుత్రిమంగా ఆక్సిజన్ అందకపోతే..వెంటనే ప్రాణాలు గాలిలో కలుస్తాయని పల్మనాలజీ వైద్యులు చెబుతున్నారు. కరోనా వైరస్ ఊపిరితిత్తులలోకి చేరిన అనంతరం ఊపిరితిత్తులలో నిమోనియా అవుతుంది. ఇది క్రానిక్ నిమోనియా గా మారితే వెంటనే రోగికి క్రుత్రిమ ఆక్సిజన్ ఎంతో అవసరం ఉంటుందంటున్నారు. వెంటనే వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందించకపోతే ప్రాణాలు దక్కని దుర్బర పరిస్థితులు నెలకొంటాయని చెబుతున్నారు. వెంటిలేటర్ పై కరోనా వైరస్ పాజిటివ్ రోగికి సాధారణ రోెగుల కన్నా..ఆక్సిజన్ ఎక్కువగా అవసరం ఉంటుందంటున్నారు. ఇప్పటికే దేశంలో ఆక్సిజన్ కొరత లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు దేశ ప్రధాని ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.